Kerala : శబరిమల అయ్యప్పస్వామి ఆలయ తలుపులు తెరచుకున్నాయి. నూతన సంవత్సరం తొలిరోజు ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవ్వగా.. మధ్యాహ్నం వరకు సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు అధికారులు ప్రకటించారు. ఆలయం మూసివేసే సమయానికి భక్తులు సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
సుమారు రెండు సంవత్సరాల తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం ఇదే తొలిసారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 2021 జనవరి 1న మధ్యాహ్నానికి సుమారు 18 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించగా, ఆ తర్వాత 2024, జనవరి 1న భక్తులు రికార్డు స్థాయిలో ఆలయానికి వచ్చినట్లు ప్రకటించారు. మండల పూజ అనంతరం గత నెల 27వ తేదీ రాత్రి ఆలయ ద్వారాలను మూసివేశారు.
అనంతరం శనివారం (డిసెంబరు30) మకరజ్యోతి ఉత్సవాల కోసం ఆలయాన్ని తిరిగి తెరిచారు. శనివారం సాయంత్రం ప్రధాన పూజారి కండారు మహేశ్ మోహనరారు, ముఖ్య పూజారి పీఎన్ మహేశ్ నంబూద్రి ఆధ్వర్యంలో ఆలయ ద్వారాలను తెరిచారు. జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యులు ప్రకటించారు. జనవరి 15న మకరజ్యోతి వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు . భక్తులు దర్శనం నిమిత్తం జనవరి 20 వరకు ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం వద్ద భద్రతను పటిష్టం చేశామన్నారు.