Demand for Gold:అంతర్జాతీయ పరిణామాలతో గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆ మూడు నెలల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.6 వేల మేర పెరిగింది. అయినా… కొనుగోళ్లు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 2022లోనూ దేశంలో బంగారానికి డిమాండ్ భారీగానే ఉందని… ప్రపంచ స్వర్ణమండలి ప్రకటించింది.
2022లో దేశంలో 774 టన్నుల బంగారానికి డిమాండ్ లభించిందని ప్రపంచ స్వర్ణ మండలి-డబ్ల్యూజీసీ వార్షిక నివేదిక వెల్లడించింది. 2021లో 797.3 టన్నుల గోల్డ్ గిరాకీతో పోలిస్తే, 2022లో 2.92 శాతం తక్కువ డిమాండ్ కనిపించింది. అయితే దిగుమతి సుంకం పెంపు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధరలు భారీగా పెరగినా… పసిడికి డిమాండ్ తగ్గకపోవడం చూస్తుంటే… భారతీయులకు బంగారంపై ఎంత మోజో అర్ధమవుతోందని డబ్ల్యూజీసీ భారత విభాగం వ్యాఖ్యానించింది.
అక్టోబరు-డిసెంబరు మధ్య పెళ్లిళ్లు, పండుగల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువగా జరిగినా, ఆ మూడు నెలల మధ్య డిమాండ్ 276.1 టన్నులకు పరిమితమైంది. 2021లో ఇదే సమయంలో 343.9 టన్నుల బంగారానికి డిమాండ్ ఉందని, 2022లో ఇది 22 శాతం తక్కువని డబ్ల్యుజీసీ తెలిపింది. విలువ పరంగా చూస్తే రూ.1,48,780 కోట్ల నుంచి 15 శాతం తగ్గి, రూ.1,25,910 కోట్లకు పరిమితమైందని వెల్లడించింది. ఇక పెట్టుబడుల కోసం బంగారం డిమాండ్ 79 టన్నుల నుంచి 56 టన్నులకు తగ్గిందని తెలిపింది. ధరలు ఊహించని స్థాయిలో పెరగడంతో… పాత బంగారాన్ని మార్చుకుని, కొత్త ఆభరణాలు తీసుకోవడం పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా 2022లో 4,741 టన్నుల బంగారానికి డిమాండ్ లభించింది. 2021లో 4012.8 టన్నులతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అంతేకాదు 2011 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బంగారానికి డిమాండ్ లభించింది 2022లోనే అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 2021లో వివిధ దేశాల బ్యాంకులు 450 టన్నుల బంగారం కొనగా… 2022లో ఏకంగా 1,136 టన్నుల పసిడి కొనడమే నిరుడు బంగారానికి భారీ డిమాండ్ లభించడానికి కారణమని డబ్ల్యూజీసీ విశ్లేషించింది. బ్యాంకుల బంగారం కొనుగోళ్లలోనే ఇది 55 ఏళ్ల గరిష్ఠస్థాయి అని తెలిపింది.