Demand For Flats:దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఫ్లాట్లు కొనేందుకే మెజారిటీ జనం మొగ్గుచూపుతున్నారు. 2022లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణె నగరాల్లో మొత్తం 2,15,666 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. 2021లో 1,28,024 ఫ్లాట్లు మాత్రమే అమ్ముడుపోగా, నిరుడు ఫ్లాట్ల విక్రయాలు ఏకంగా 68 శాతం పెరిగాయి. గత పదేళ్లలోనే ఇది అత్యధికం. 2010లో 2,16,762 ఫ్లాట్లు అమ్ముడుపోగా… మళ్లీ 2022లోనే ఆ స్థాయిలో ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయి. ఈ జోరు ఈ ఏడాది కూడా కొనసాగవచ్చని నిర్మాణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీర్ఘ కాల పరిమితితో కూడిన రుణాలు, అత్యుత్తమ ధరల వల్ల… జనం ఫ్లాట్లు కొనేందుకు మొగ్గుచూపుతున్నారని అంటున్నాయి.
మరోవైపు… ఇళ్లు కొనేవారిలో 71 శాతం మంది అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లవైపే మొగ్గుచూపుతున్నారని… ఓ సర్వే తేల్చింది. కొనేందుకైనా, అద్దెకైనా… 3 లేదా 2 పడక గదుల ఇళ్ల కోసమే ఎక్కువ మంది వెతుకుతున్నారని చెబుతోంది. హైదరాబాద్లో అత్యధికంగా 56 శాతం మంది 3 బీహెచ్కే, ఆపై ఇళ్ల మీద ఆసక్తి చూపించగా… 2 బీహెచ్కే ఫ్లాట్లు కావాలని 41 శాతం మంది మాత్రం కోరుకున్నారు. ఇక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం కేవలం 3 శాతం మందే వెతికారని తేలింది. 25 శాతం మంది మాత్రం ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాల కోసం సెర్చ్ చేశారని సర్వేలో తేలింది.
2022లో ఇల్లు కొనాలనుకునే వారిని ఆకర్షించిన నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానం బెంగళూరు దక్కించుకోగా, రెండో స్థానంలో ముంబై, మూడో స్థానంలో పుణే నిలిచాయి. ఈ నాలుగు నగరాల్లో 80 శాతం మంది అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు కొనేందుకే మొగ్గు చూపించారు. హైదరాబాద్లో ప్రధానంగా కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, బీరంగూడ ప్రాంతాల్లో ఇళ్లు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపించారు.