Delhi Crime: ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివేక్ అనే బాలుడిపై కక్ష పెంచుకున్న ఆరుగురు స్నేహితులు.. కసితీరా కత్తులతో పొడిచి పొడిచి చంపారు. గురువారం (డిసెంబర్14) రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్ ఢిల్లీ డీసీపీ చందన్ చౌదరి వెల్లడించారు.
నిందితుల్లో ఒకడైన మైనర్ బాలుడు, హత్యకు గురైన వివేక్ స్నేహితులు. కొద్దినెలల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. వివేక్ పై కక్ష పెంచుకున్న అతను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. తనకు సహాయం చేయాలని ఐదుగురు స్నేహితులను కోరాడు. ప్లాన్ ప్రకారం.. గురువారం సాయంత్రం వివేక్ ను బయటికెళ్దామని నమ్మించి ఇంటి నుంచి బయటకు రప్పించాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. తర్వాత అతడిని దగ్గర్లో ఉన్న సత్పులా పార్కులోకి తీసుకెళ్లాడు.
అప్పటికే వివేక్ కోసం మాటు వేసి ఉన్న మైనర్ బాలుడి స్నేహితులు అతనిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తల, మెడ, పొట్ట భాగాల్లో కత్తులతో పొడిచారు. దగ్గర్లో ఉన్న ఇటుకలతో దాడి చేశారు. వివేక్ చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత.. అక్కడి నుంచి పరారయ్యారు. వివేక్ మృతదేహాన్ని చూసిన స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృతుడిని బేగంపుర్ నకు చెందిన వివేక్ గా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారమిచ్చి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వివేక్ ను హత్య చేసిన వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.