Cyclone Dana Effect exam postponed, trains cancelled: బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వివత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ఈ తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా బలపడనుందని హెచ్చరించింది. ఒడిశాలోని పరదీప్కు 560 కి.మీ, పశ్చిమబెంగాల్లోని సాగర్ ద్వీపానికి 630కి.మీ, బంగ్లాదేశ్లోని ఖేపురకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీంతో పాటు కోస్తాంధ్రలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించింది. అయితే రెండు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
దానా తుఫాన్ ప్రభావంతో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. ఈ మేరకు పలు రైళ్లు రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించింది. అయితే ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 34 రైళ్లను రద్దు చేసింది. ఈ వివరాలను ప్రయాణికులకు తెలియజేసేందుకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు.
దానా తుఫాను ప్రభావంతో ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈనెల 23 నుంచి జరగాల్సిన పరీక్షలను రద్దు చేసింది. దీంతో పాటు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓపీఎస్సీ ఒడిషా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష 2023-24ను వాయిదా వేసింది. ముందుగా ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 27, 2024న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రిలిమినరీ పరీక్షకు సవరించిన తేదీ వచ్చే ఏడు రోజుల్లో ప్రకటించనున్నట్లు పేర్కొంది.