Crude Oil:దేశంలో భారీగా వినియోగించే పెట్రోల్, డీజిల్ కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది… భారత్. దీని కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వివిధ అంతర్జాతీయ పరిణామాల కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. అయినా… కొరత రాకుండా చూసుకునేందుకు, తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి ముడిచమురును కొంటూ వచ్చింది… భారత్. కానీ, ఉక్రెయిన్ మీద దండెత్తిన రష్యాపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడంతో… ఆ దేశ అవసరం మనకు వరమైంది. ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకే భారీగా ముడిచమురును కొంటోంది… భారత్. అది క్రమంగా పెరిగి ఇప్పుడు ఏకంగా 28 శాతానికి చేరింది.
ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభానికి ముందు మన దేశం దిగుమతి చేసుకునే ముడిచమురులో రష్యా వాటా కేవలం 0.2 శాతమే ఉండేది. ఆంక్షల కారణంగా చాలా దేశాలకు ముడిచమురు ఎగుమతి నిలిచిపోవడంతో, ఆదాయం కోసం డిస్కౌంట్ ధరకే మనకు క్రూడాయిల్ సరఫరా చేస్తోంది… రష్యా. మనతో పాటు చైనా కూడా రష్యా ముడిచమురును తక్కువ ధరకే కొంటోంది. గత జనవరిలో భారత్ దిగుమతి చేసుకున్న ముడిచమురులో రష్యా వాటా 28 శాతానికి చేరింది. డిసెంబర్లో ఇది 26 శాతమే ఉంది. ఇరాన్, వెనుజువెలా మినహా… రష్యా నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకునే విషయంలో భారత్పై ఎలాంటి ఆంక్షలూ లేకపోవడంతో… రోజురోజుకూ రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతిని పెంచుతోంది… భారత్. G7 దేశాలు బ్యారెల్ రష్యా ఆయిల్పై 60 డాలర్ల పరిమితిని విధించగా… మన దేశం అంతకంటే తక్కువకే కొంటోంది. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం కూడా భారీగా ఆదా అవుతోంది. ప్రస్తుతం రష్యా నుంచి 28 శాతం, ఇరాక్ నుంచి 20 శాతం, సౌదీ అరేబియా నుంచి 17 శాతం, అమెరికా నుంచి 9 శాతం, యూఏఈ నుంచి 8 శాతం క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటోంది… భారత్.
For More Live Updates Follow Us :-