Science and Technology : సైన్స్ అండ్ టెక్నాలజీ అభవృద్ధి చెందడం మంచిదే కానీ దాని వల్ల కూడా అనేక నష్టాలు జరుగుతాయని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి పరిశోధనలు కూడా మొదలయ్యాయి. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అంతా కలిసి సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాన్ని మనుషులకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లిస్ట్ లోకి చేరారు డీఎస్టీ సెక్రెటరీ ఎస్ చంద్రశేఖర్.
సైన్స్ అండ్ టెక్నాలజీని మన జీవితాలకు తగినట్టుగా మార్చుకునే ముందు దాని వల్ల జరిగే నష్టాలు దృష్టిలో పెట్టుకోవడం మంచిది అన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రెటరీ ఎస్ చంద్రశేఖర్. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చాలావరకు టెక్నాలజీలు మనం ఊహించకుండ మన జీవితాల్లోకి వచ్చినవే. అందుకే వాటి ప్రెజెన్స్ వల్ల మనకి జరిగే నష్టాన్ని కనిపెడుతూ ఉండాలన్నారు. తాజాగా జరిగిన ది సైన్స్ సాగా అనే ఈవెంట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల మనుషులకి జరుగుతున్న నష్టంపై ప్రత్యేక చర్చలు జరిగాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గతంలో ఎలా ఉందని గమనిస్తే అది భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేస్కుంటుంది తెలుసుకోవడం సులభం అని నిపుణులు చెప్తున్నారు. హిస్టరీ, ఫ్యూచర్.. ఈ రెండు సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ముఖ్యమని వారు అంటున్నారు. మానవాళి బాగుండాలంటే ఎలాంటి సైంటిఫిక్ ప్రిన్సిపుల్స్ కావాలి అనేది కూడా గమనించాలని తెలిపారు. దానికోసం బయోలజీ, కెమిస్ట్రీ, మెటాల్యూర్జీ వంటి రంగాల్లో జరుగుతున్న మార్పులని గమనిస్తూ ఉండాలన్నారు. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు ఇలాంటి విషయాలపై ఫోకస్ చేయాలన్నారు.
ఈరోజుల్లో రోజుకొక టెక్నాలజీ పుట్టుకొస్తుంది. అందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒకటి. దీని గురించి సరిగా తెలుసుకోవాలంటే హ్యూమన్ అప్రోచ్ అవసరమని నిపుణులు చెప్తున్నారు. కానీ మారుతున్న టెక్నాలజీలు వల్ల హ్యూమన్ అప్రోచ్ అనేది చాలావరకు తగ్గిపోయింది. మనిషి లేకుండా కార్ నడవడం, మనిషి లేకుండా ఎగ్జాం పేపర్ సెట్ చెయ్యడం, మనిషి లేకుండానే ఆన్సర్ షీట్ పూర్తి చేయడం లాంటి టెక్నాలజీలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటన్నింటి మధ్యలో టెక్నాలజీ కూడా ఒక మనిషి తయారు చేశాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అలాగే దాని వల్ల కలిగే ఎన్నో నష్టాలను కూడా ఇలాగే చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. అలా కాకుండా వీటిపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.