China’s rich man’s:ఏ నిమిషానికి, ఏమి జరుగునో.. ఎవరూహించెదరు? అని అప్పుడెప్పుడో వచ్చిన లవకుశ సినిమాలో ఓ హిట్ సాంగ్ ఉంది. ఇప్పటికీ అది మన తెలుగునాట ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. ఇదొక్కటే కాదు… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయనే సామెత కూడా తెలుగులో ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఆ పాట, సామెత… ఓ చైనా కుబేరుడి విషయంలో నిజమైనందుకు… ఆ రెండు ఉదాహరణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఆ చైనా కుబేరుడు ఎవరని అనుకుంటున్నారా? డ్రాగన్ కంట్రీలో ప్రముఖ రియలెస్టేట్ కంపెనీ అయిన ఎవర్గ్రాండ్ గ్రూప్ చైర్మన్ హుయ్ కా యన్. ఈయన సంపద మొత్తం… హుష్ కాకి అన్నట్టుగా కరిగిపోయింది. కరోనా మహమ్మారి ప్రభావం, ఆర్థిక మాంద్యం దెబ్బకు దాదాపు 93 శాతం సంపదను కోల్పోయారు… హుయ్ కా యన్. 42 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆసియాలోనే రెండో సంపన్నుడిగా పేరుపొందిన హుయ్ కా యన్ ప్రస్తుత ఆస్తి… కేవలం 3 బిలియన్ డాలర్లే అని బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ వెల్లడించింది.
2020లో 110 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అమ్మకాలతో, 280 కంటే ఎక్కువ నగరాల్లో 13 వందలకు పైగా ప్రాజెక్టులతో ఘనమైన స్థాయిలో ఉన్న ఎవర్గ్రాండ్ గ్రూప్… కరోనా దెబ్బకు రియలెస్టేట్ పాతాళానికి పడిపోయి, అప్పుల్లో కూరుకుపోయింది. కంపెనీని కాపాడుకోవడం కోసం హుయ్ కా యన్… తన ఇళ్లు, ప్రైవేట్ జెట్ విమానాలను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎవర్గ్రాండ్ గ్రూప్… చైనాలోనే అత్యధిక రుణాలున్న కంపెనీ. దాంతో… ది చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్-సీపీపీసీసీలోని ఎలైట్ 300 మెంబర్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడైన హుయ్ కా యన్ ను… వార్షిక సమావేశానికి రావొద్దని చెప్పేశారు. అంతేకాదు… వచ్చే ఐదేళ్ల పాటు… సీపీపీసీసీలోని ఎలైట్ 300 మెంబర్ స్టాండింగ్ కమిటీ నుంచి ఆయన్ను మినహాయించారు.