China–Pakistan : సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చైనా అన్ని దేశాలను దాటి ముందుకు దూసుకుపోతోంది. దీనిని చూసి సంతోషంగా లేని ఎన్నో దేశాలు చైనా నుండి సహాయం అందుకోవడం కానీ, చైనాకు సహాయం చేయడం కానీ జరగకూడదని నిర్ధారించుకున్నారు. కానీ మరికొన్ని దేశాలు మాత్రం వాటి అభివృద్ధి కోసం చైనాతో చేతులు కలపడానికి వెనకాడడం లేదు. అందులో ఒకటి పాకిస్థాన్.
తాజాగా చైనాకు, పాకిస్థాన్కు మధ్య విత్తనాల విషయంలో ఒప్పందం జరిగింది. భవిష్యత్తులో ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజ్ను అధిగమించాలంటే పాకిస్థాన్కు చైనా అవసరం ఉంది. కొన్నాళ్ల క్రితం చైనా స్పేస్ స్టేషన్ నుండి ఏడు హెర్బల్ విత్తనాలను చైనా.. పాకిస్థాన్కు అందించింది. దీని ద్వారా స్పేస్ బ్రీడింగ్ అనేది పాకిస్థాన్కు ఉపయోగపడింది. కాస్మిక్ రేడియేషన్, మేక్రోగ్రావిటీ ద్వారా చేసేదే స్పేస్ బ్రీడింగ్. ఈ ప్రక్రియ ద్వారా ఎంతో హైబ్రిడ్ విత్తనాలు కూడా వారికి లభించాయి.
చైనీస్ స్పేస్ స్టేషన్లో పాకిస్థాన్ విత్తనాలు మొలకెత్తడం మంచి పరిణామమని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. పాకిస్థాన్లో వాతావరణ మార్పులు ఎక్కువగా ఉంటాయని, అందుకే స్మార్ట్ అగ్రికల్చర్ లాంటిది అవసరమని వారు బయటపెట్టారు. స్మార్ట్ అగ్రికల్చర్ కోసం ఎన్నో కొత్త రకమైన విత్తనాలు కావాల్సి ఉంటుంది. అవి మాత్రమే వాతావరణ మార్పులకు తగినట్టుగా, కొత్త వాతావరణానికి అలవాటు పడుతూ పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
గతేడాది ఏప్రిల్ 12న పాకిస్థాన్ విత్తనాలను చైనా స్పేస్ ఏజెన్సీకి తీసుకువచ్చారు. 2022 జూన్ 5న షెంజో 14 స్పేస్షిప్ ద్వారా ఇవి అంతరిక్షానికి వెళ్లాయి. ఆరు నెలలు స్పేస్లో ఉన్న తర్వాత డిసెంబర్ 4న అవి మళ్లీ నేలకు వచ్చాయి. యూనివర్సిటీ ఆఫ్ కరాచీ పరిశోధకులకు ముందుగా ఈ స్పేస్ బ్రీడింగ్ ఆలోచన వచ్చింది. వారే మరిన్ని పరిశోధనలను చేసి.. ఈ ప్రక్రియను సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగించారు.
ఒకే రకమైన విత్తనాలను స్పేస్కు పంపించడంతో పాటు వాటినే రీసెర్చ్ సెంటర్లో పెట్టి పరిశోధనలు చేపట్టారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు తిరిగి వచ్చిన విత్తనాలను, ల్యాబ్లో పెరిగిన విత్తనాలు పోలుస్తూ మరికొన్ని పరీక్షలు చేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ తర్వాత ఈ రెండు విధాల విత్తనాలను భూమిలో పెట్టి రిజల్ట్ను గమనించనున్నారు. పాకిస్థాన్ ఇలా విత్తనాలను స్పేస్కు పంపించడం మొదటిసారి కావడంతో ఇది ఆ దేశానికి గర్వకారణం అని చైనా శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు.