China Companies : ఉద్యోగుల్ని తొలగించే అంశంలో ఇప్పుడు చైనా కంపెనీల వంతు వచ్చింది. మొబైల్ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాలతో… చైనా మొబైల్ కంపెనీలు ఇండియాలో పొదుపు మార్గాలపై దృష్టి సారించాయి. వచ్చే ఏడాదికి వ్యయ నియంత్రణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగ కోతలు ప్రారంభించగా… దేశంలో మొబైల్ తయారీ దిగ్గజ కంపెనీలూ అదే బాటలో ఉన్నాయి. కంపెనీల నుంచి ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల సప్లై స్తబ్దుగా ఉండటంతో… వచ్చే ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే మార్కెటింగ్, పంపిణీ విభాగాల్లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సిద్ధం లేదు. పైగా ఉద్యోగాల్లో కోతకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది మాదిరే వచ్చే ఏడాది కూడా గిరాకీలో స్తబ్దత, నియంత్రణపరమైన ఒత్తిళ్లు కొనసాగితే లాభదాయకతపై ప్రభావం పడొచ్చని మొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ఉద్యోగుల తొలగింపు, స్వచ్ఛంద పదవీ విరమణల దిశగా అవి అడుగులు వేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశీయ స్మార్ట్ఫోన్ విపణిలో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. షావోమీ, ఒపో, వివో వంటి చైనా కంపెనీల కార్యకలాపాలపై ఓవైపు ప్రభుత్వ పరిశోధనా సంస్థలు దర్యాప్తు చేస్తుండగా… మరోవైపు చివరి త్రైమాసికంలో ఆయా కంపెనీల స్మార్ట్ఫోన్ల సరఫరా స్తబ్దుగా ఉంది. అందుకే పలు చైనా కంపెనీలు 600 నుంచి 800 మంది ఉద్యోగులను తొలగించాయని చెబుతున్నారు. డేటా రక్షణ విధానాల్లో కఠిన ఆంక్షల నేపథ్యంలో… ఆయా కంపెనీల్లోని ఉద్యోగులే స్వచ్ఛందగా తప్పుకుని ఇతర ఉద్యోగాలు చూసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా సేల్స్ డివిజన్లలోని ఉన్నతాధికారులు మొబైల్ కంపెనీలను వీడుతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఆయా కంపెనీలు 30 శాతం సిబ్బందిని తగ్గించుకున్నాయని… వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.