China : చైనా అన్ని రంగాల్లో ఇతర ప్రపంచ దేశాలకంటే ముందు ఉండాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో చైనాను ఎవరూ అందుకోకుండా ఎదగాలన్నదే ఆ దేశం టార్గెట్గా పెట్టుకుంది. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఇతర దేశాలు చేయని కొత్త ప్రయోగాలకు నాంది పలుకుతోంది. తాజాగా వ్యవసాయ రంగంలో కూడా కొత్త మార్పులకు చైనా శ్రీకారం చుట్టింది.
దేశంలో పెరుగుతున్న ఫుడ్ సెక్యూరిటీ రిస్క్లను బట్టి చైనా వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆహార పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం ఇవన్నీ చైనాలో ఫుడ్ సేఫ్టీని దెబ్బతీస్తున్నాయి. అందుకే విత్తనాల తయారీలో, పెంపకంలో మరింత మెరుగ్గా స్టడీ జరపాలని ఆ దేశ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దీని ద్వారా ఔట్పుట్ను, క్వాలిటీని పెంచుకోవాలని వారు భావిస్తున్నారు.
ఇతర రంగాల్లో చైనా ఎంత అభివద్ధి చెందినా.. విత్తనాల తయారీలో మాత్రం అది ఇంకా వెనుకంజలోనే ఉంది అని చైనా శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో తేలింది. విత్తనాల విషయంలో అమెరికా లాంటి ఇంకెన్నో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చైనా వెనుకబడి ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అభివృద్ధిని కనబరిచినా.. విత్తనాల తయారీలో మాత్రం ఏ మార్పు లేదన్నారు. కానీ మరికొందరు మాత్రం వ్యవసాయ రంగంలో చైనా ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలను చేసి సక్సెస్ సాధించింది అని వాదిస్తున్నారు.
ముఖ్యంగా సీడ్ ఇండస్ట్రీపైనే పలువురు శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి సీడ్ ఇండస్ట్రీని కొత్త దారిలో నడిపించామని వారు గర్వంగా చెప్తున్నారు. వ్యవసాయ రంగం విషయంలో, ఆహార పదార్థాల తయారీ విషయంలో చైనా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. దీని వల్లే ఫుడ్ సెక్యూరిటీ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. అలా జరగకుండా ఉండడానికే శాస్త్రవేత్తలు సీడ్ ఇండస్ట్రీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ముందుకు వెళ్తున్నారు.