Chicken Prices hike in Telugu States: మాంసం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరోసారి ఆకాశన్నంటాయి. చికెన్ ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత భారం పడనుంది. దీంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వారానికి ఒక్కరోజైనా చికెన్ తినాలనుకునే ప్రజలకు పెరిగిన ధరలు భారం కానున్నాయి.
తెలంగాణలో సెప్టెంబర్ మొదటి వారంలో చికెన్ స్కిన్ లెస్ ధర రూ.160 నుంచి 180 మధ్య పలికింది. రెండు వారాల క్రితం రూ. 200 దాటింది. గత వారం రూ.230కి చేరింది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర రూ.240కిపైగా పలుకుతోంది. అయితే, దసరా పండుగ మరికొద్ది రోజుల్లో రానుంది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతో వ్యాపారులతోపాటు కోళ్ల పెంపకంపై పెంపకదారులు ఆసక్తి కనబర్చలేదు. దీంతో కోళ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. సరఫరా తగ్గిపోవడంతో పాటు చికెన్ తినేవారి సంఖ్య పెరగడంతో మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
Also Read: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు
ఇక, కోడి గుడ్ల విషయానికొస్తే.. ఒక్కో కోడి గుడ్డు రూ.5 నుంచి 6 వరకు పలుకుతోంది. కొన్ని చికెన్ దుకాణాల్లో కిలో చికెన్కు 4 గుడ్లు ఉచితంగా అందిస్తున్నట్లు ఆఫర్ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేసి కస్టమర్స్ను ఆకర్షిస్తున్నారు.
తెలంగాణలో ఎక్కువశాతం నాన్ వెజ్ తింటుంటారు. ముక్కలేనిదే కొంతమందికి తినాలని అనిపించదు. కొంతమంది వారంతో సంబంధం లేకుండా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తింటుంటారు. మరికొంతమంది ఆదివారం వచ్చిందంటే ఇంట్లో చికెన్ వండాల్సిందే. ఇందులో భాగంగానే చికెన్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ పెరిగిన ధరలు సామాన్యులను నిరాశకు గురిచేశాయి.