Latest AP political News: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాత్రం రోజురోజుకూ దిగజారుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఆయా పార్టీ మహిళా నేతల నోటికి అద్దూ అదుపూ లేకుండా పోతోంది. ఒకరినొకరు పోర్న్ స్టార్లతో పోలుస్తూ సభ్యసమాజం సిగ్గుపడే స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. వీరి చర్యలతో ఏపీ ప్రజలు రాజకీయాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది.
టీడీపీ, వైసీపీ ఇరు పార్టీలకు చెందిన నాయకులు పోటా పోటీగా మహిళను కించపరుస్తూ పోస్టులు పెట్టుకోవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ మహిళా నాయకురాలు స్వాతిరెడ్డి టార్గెట్ గా తొలుత సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అశ్లీలంగా చిత్రీకరిస్తూ, అసభ్య పదజాలాలతో పోస్టులు, కామెంట్లు హల్ చల్ చేశాయి.
టీడీపీ నాయకురాలు స్వాతిరెడ్డి లక్ష్యంగా ప్రారంభమైన ఈ వ్యవహారం మరో నాయకురాలు అనూష ఉండవల్లి వరకు చేరింది. స్వాతిరెడ్డిపై సభ్యసమాజం తలదించుకునే స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందంటూ అనూష ఉండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.
వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రచారం సాగుతోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత లోకేష్ కూడా అసభ్య ప్రచారాన్ని ఖండించారు. మరోవైపు వైసీపీకి చెందిన మహిళా మంత్రులు, నాయకులపై కూడా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ పోర్న్ పాలిటిక్స్ పై ఇటు లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీకి చెందిన సోషల్ మీడియా వింగ్ దుష్ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఇళ్లల్లో మహిళలపై కించపరుస్తూ పోస్టులు పెట్టే నీచ స్థాయికి టీడీపీ చేరి.. దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపిందనేది లక్ష్మిపార్వతి విమర్శించారు.
ఇరు పార్టీల మహిళా నేతల తీరును అసహ్యించుకుంటున్నారు ఏపీ ప్రజలు. నీచ రాజకీయాల కోసం ఇలా మహిళలు సోషల్ మీడియాలో తిట్టిపోసుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇప్పటికైన ఇరు పార్టీల నాయకత్వాలు మహిళలను వివాదాల్లోకి లాగకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.