Flu Variant : మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లను బట్టి మనిషి ఆరోగ్యం రోజురోజుకీ దెబ్బతింటోంది. ఆఖరికి పీల్చుకునే గాలి నుండి మానవాలికి ప్రాణహాని ఏర్పడుతుంది. రోజుకొక అంతుచిక్కని వ్యాధి మనిషిని బాధపెడుతోంది. ఇప్పటికే కోవిడ్ కొట్టిన దెబ్బ నుండి పూర్తిగా బయటపడకముందే.. ఒక పాత వ్యాధి మళ్లీ తెరపైకి వచ్చినట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అదే స్వైన్ ఫ్లూ.
కోవిడ్ కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెట్టిన వ్యాధి స్వైన్ ఫ్లూ. ఈ వ్యాధి పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇన్నాళ్ల తర్వాత కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) అందించిన డేటా ప్రకారం.. తెలంగాణలో 2022 డిసెంబర్ నుండి 2023 మార్చ్ మధ్యలో స్వైన్ ఫ్లూకు సంబంధించిన ఒక సబ్టైప్ ఏ(హెచ్3ఎన్2) కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.
గాంధీ ఆసుపత్రి లేబరెటరీ నుండి సేకరించిన వివరాల ప్రకారం ఐసీఎమ్మార్ ఈ డేటాను పొందుపరిచింది. ముందుగా స్వైన్ ఫ్లూ కూడా జ్వరం రూపంలోనే అటాక్ చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. జ్వరం, గొంతునొప్పి, కీళ్ల నొప్పులు, దగ్గు.. స్వైన్ ఫ్లూ లక్షణాలను వారు తెలిపారు. అలాంటి లక్షణాలతో వచ్చిన వారికి కోవిడ్ టెస్ట్ చేసినా కూడా నెగిటివ్ అని తేలింది. దీంతో వారికి వచ్చిన వ్యాధి స్వైన్ ఫ్లూనే అని వైద్యులు నమ్మడం మొదలుపెట్టారు.
స్వైన్ ఫ్లూ లాగానే దాని సబ్టైప్ ఏ(హెచ్3ఎన్2) కూడా వ్యాప్తి విషయంలో వేగంగా ఉంటుందని తేలింది. అందుకే గత డిసెంబర్ నుండి ఇప్పుడు మార్చ్ వరకు ఎన్నో స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని డేటా చెప్తోంది. కోవిడ్ లాగానే స్వైన్ ఫ్లూకు కూడా ప్రత్యేక చికిత్స అనేది ఏమీ లేదని, కేవలం దానికి మాత్రమే కాకుండా ఏ వైరల్ వ్యాధులకు కూడా ప్రత్యేకంగా చికిత్సలు లేవని వైద్యులు బయటపెట్టారు. సెల్ఫ్ కేర్, ముందుజాగ్రత్తతో మాత్రమే దీని వ్యాప్తిని అరికట్టగలమని వారు సూచించారు.