Mankind IPO : ఈ మధ్యకాలంలో ఐపీఓ అంటేనే భయం పట్టుకుంది. ఎల్ఐసీ నుంచి ఏ ఒక్క ఐపీఓ సక్సెస్ అయింది లేదు. మార్కెట్లో మంచి బ్రాండ్ ఉన్న కంపెనీలు సైతం చతికిలపడ్డాయి. పైగా మార్కెట్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. అయినా సరే… మ్యాన్ కైండ్ కంపెనీ ధైర్యం చేస్తోంది.
దేశంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో మ్యాన్ కైండ్ ఒకటి. ఈ కంపెనీకి 25 మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నాలుగు ఆర్ అండ్ డీ సెంటర్స్, అందులో 600 మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కిట్స్, కాంట్రసెప్టివ్స్, యాంటాసిడ్ పౌడర్స్, విటమిన్స్, మినరల్ సప్లిమెంట్స్, యాంటీ యాక్నే కేటగిరీల్లో మందులు అందిస్తోంది.
మ్యాన్కైండ్ ఫార్మా ఐపీవో ఈ నెల 25న ప్రారంభమై..27న ముగుస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన 40,058,844 ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.1,026 నుంచి రూ.1,080 మధ్య ఉంటుంది. మొత్తం రూ.4,300 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరిస్తోంది. ఈ డబ్బు కంపెనీకి కాకుండా, వాటాలను అమ్మిన ప్రమోటర్లకు వెళ్తుంది.
ప్రైస్ బ్యాండ్ కాస్త ఎక్కువగా ఉన్నందున గ్రే మార్కెట్ ప్రీమియం తక్కువగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఐపీవో ద్వారా సమీకరిస్తున్న ఈ మెుత్తాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించకపోవటం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం రానున్న కాలంలో మరింత తగ్గవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. అయితే, ఈ నిధులను ప్లాంట్ విస్తరణకు ఉపయోగిస్తామని కంపెనీ చెబుతోంది.