ఎందుకంత వివక్ష ?
– రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం
– గోదావరి పుష్కరాలకు ఆంధ్రాకు రూ.100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు ఏమివ్వరా?
– లోక్సభలో బీఆర్ఎస్ ఉండి ఉంటే తెలంగాణకు అన్యాయం జరిగేది కాదు
– నిధుల కేటాయింపులో వివక్ష తగదు
– కేంద్ర ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
హైదరాబాద్, స్వేచ్ఛ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపించిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్కు రూ.100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని ఫైరయ్యారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని చురకలంటించారు.
బీజేపీ ఫెయిల్…
‘‘తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. లోక్సభలో బీఆర్ఎస్ ఉండి ఉంటే, తెలంగాణకు అన్యాయం జరిగేది కాదు. కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేసి, ఆంధ్రప్రదేశ్కు అడిషనల్ గ్రాంట్ కింద రూ.15,000 కోట్లు ఇచ్చారు.
మొదట్నుంచి ఇంతే…
ఏపీకి ఇచ్చారని మా బాధ కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే మా ఆవేదన. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుండి మొండి చెయ్యే చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇంత వివక్ష ఎందుకు? ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు హరీష్ రావు.
Also Read : డీఎస్పీగా సిరాజ్… నియామక పత్రాలిచ్చిన డీజీపీ జితేందర్