Sabarimala Temple : ప్రతీ ఏడాది లక్షలాది మంది అయ్యప్ప స్వామి దీక్షను చేపడుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. ఎంతో భక్తితో పూజలు చేస్తూ నియమనిష్టలతో మండల దీక్ష చేసి హరిహరసుతుడ్ని సేవిస్తుంటారు. శబరిమల వెళ్లే భక్తులు ముందు అక్కడి తెల్లగా ఉండే భారీ మసీదులోకి వెళ్తారు. దీనిని వావర్ మసీదు అంటారు.అయ్యప్ప స్వామిని, వావర్ స్వామిని ప్రార్థిస్తూ జయజయధ్వానాలు చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసి, విభూది, మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు.
అయ్యప్ప మాల ధరించిన భక్తులు తమ తమ సంప్రదాయాలను అనుసరించి మసీదులో పూజలు చేస్తారు. అక్కడే నమాజు కూడా చేస్తారు. అయితేఈ మసీదులో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం 500 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. శబరిమల ఆలయంతో మసీదుకు ఉన్న సంబంధాలను చెప్పేలా మసీదు కమిటీ ఒక ఉత్సవం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ వేడుకను చందనకూడమ్ అంటారు. ఇరుమలైలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. కొండపైకి ఎక్కి వెళ్లే యాత్రికులు చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి వీరి ఇళ్లలో ఆగుతుంటారు.
వావర్ అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అయ్యప్పపై ఆయనకు ఉన్న భక్తి గురించి శతాబ్దాల నుంచీ చెప్పుకుంటున్నారు.అందుకే భక్తులు శబరిమల యాత్రలో వావర్ స్వామి ఉన్న మసీదును దర్శించడం ఒక సంప్రదాయంగా మారింది. వావర్ గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెబుతారు. కొంతమంది మాత్రం మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్ ఒక వీరుడు అని చెబుతారు.కానీ వావర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు.