Backlash to Meta : అసలు సోషల్ మీడియానే ఉపయోగించని వారు ఈరోజుల్లో చాలా తక్కువమంది ఉంటారు. కానీ అందులో సగం మంది సోషల్ మీడియాపై పూర్తిగా అవగాహన లేకుండానే ఉపయోగిస్తుంటారు. అవగాహన లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే సోషల్ మీడియాను ఉపయోగించినా కూడా దాని వల్ల చాలా నష్టాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే మెటా లాంటి సోషల్ మీడియా వరల్డ్పై మలేషియా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వారు పోస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి అనే విషయంలో ప్రత్యేకంగా కంపెనీ రూల్స్ ఏం పెట్టలేదు. అందుకే కొందరు హానికరమైన కంటెంట్ను కూడా పోస్ట్ చేస్తున్నారంటూ మలేషియా ప్రభుత్వం ఫైర్ అయ్యింది. అంతే కాకుండా ఫేస్బుక్లో విచ్చలవిడిగా హానికరమైన కంటెంట్ పోస్ట్ అవుతుందని, దీనికి ఫేస్బుక్ ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని, మెటా సంస్థపై కేసు పెట్టడానికి కూడా ఆ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.
రేస్, మతం, గ్యాంబ్లింగ్, స్కామ్స్.. ఇలాంటి వాటి గురించి ఫేస్బుక్ ఎక్కువగా కంటెంట్ చూపిస్తుందని మలేషియన్ కమ్యూనికేషన్ అండ్ మల్టీమీడియా కమిషన్ (ఎమ్సీఎమ్సీ) ఆరోపించింది. ఇవన్నీ యూజర్లను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపింది. ఫేస్బుక్ నుండి ఇలాంటి హానికరమైన కంటెంట్ను తీసివేయాలని మెటా ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలం అవుతూనే ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా మలేషియా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు మెటా యాజమాన్యం ఇస్తున్న సమాధానాలు కూడా అంత తృప్తికరంగా లేవని మలేషియా ప్రభుత్వం బయటపెట్టింది.
మెటా నుండి సరైన స్పందన లేకపోవడం వల్ల చట్టపరంగా దానిపై చర్యలు తీసుకోవాలని మలేషియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంతకు ముందు టెలిగ్రామ్ యాప్పై కూడా అక్కడి ప్రభుత్వం ఇలాంటి చర్యలే తీసుకుంది. ఇప్పటికీ ఈ కేసు కోర్టులోనే ఉంది. పైగా ఇలాంటి సోషల్ మీడియాలో హానికరమైన కంటెంట్ను పబ్లిక్ చేసే యాప్స్పై కఠినంగా చర్యలు తీసుకోవడం కోసం కొత్త చట్టాలతో ముందుకు రావాలని మలేషియా ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.