ఆదాయం తగ్గిపోతుండటంతో ఖర్చుల నియంత్రణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్ని తొలగిస్తున్న అమెజాన్… క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల్లో మాత్రం ఏటా 48 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వబోతోంది. ఆసియా పసిఫిక్ రీజియన్ కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించింది… అమెజాన్ వెబ్ సర్వీసెస్-AWS. మన దేశంలో AWSకు ఇది రెండో మౌలిక సదుపాయాల రీజియన్ సెంటర్. వచ్చే 8 ఏళ్లలో 4.4 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.36,300 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది AWS. దీని ద్వారా ఏడాదికి 48 వేల ఫుల్ టైమ్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాదు 2030 నాటికి దాదాపు 7.6 బిలియన్ల డాలర్ల మేర… భారత స్థూల జాతీయోత్పత్తికి తోడ్పాటు అందిస్తుందని కూడా భావిస్తున్నారు.
ఆసియా పసిఫిక్ రీజియన్ కార్యకలాపాలు హైదరాబాద్లో ప్రారంభం కావడంతో… డిజిటల్ ఇండియాకు మద్దతు లభిస్తుందని AWS అభిప్రాయపడింది. దేశంలో 2011లో తమ మొదటి సెంటర్ ఏర్పాటు చేశామని… ఇప్పుడు రెండో సెంటర్ ఏర్పాటు దీర్ఘకాలిక పెట్టుబడిలో భాగమని తెలిపింది. డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా… కస్టమర్లు అనేక ఆవిష్కరణలను నడపడానికి, AWS తోడ్పడుతుందని కంపెనీ ప్రకటించింది.
డేటా సెంటర్ల విస్తరణకు సంబంధించి… AWSపెట్టుబడులను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు. ప్రధాని మోడీ ఆకాంక్ష అయిన ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఇండియా సాధనకు ఇది ఖచ్చితంగా సహాయపడుతుందని ఆయన అన్నారు. దేశంలో ప్రగతిశీల డేటాసెంటర్ హబ్గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేసేలా… హైదరాబాద్లో AWS రీజియన్లో దాదాపు రూ.36,300 కోట్ల పెట్టుబడి పెట్టడంపై తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.