Automobile sales : 2022లో దేశీయ వాహన పరిశ్రమ రికార్డులు బద్దలుకొట్టింది. ఏకంగా 37 లక్షల 93 వేల ప్రయాణికుల వాహనాలు అమ్ముడుపోవడంతో సరికొత్త రికార్డు నమోదైంది. 2018లో 33 లక్షల 30 వేల వాహనాలు అమ్ముడుపోవడం ఇప్పటిదాకా ఉన్న రికార్డు కాగా… 2022 ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. 2018తో పోలిస్తే 2022లో 14 శాతం ఎక్కువగా వాహన విక్రయాలు జరిగాయి. 2021లో దేశంలో 30 లక్షల 81 వేల ప్రయాణికుల వాహనాలు అమ్ముడుపోయాయి. అప్పటితో పోలిస్తే 2022లో 23 శాతం అధికంగా ప్రయాణికుల వాహన విక్రయాలు జరిగాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ కార్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. టయోటా కిర్లోస్కర్, స్కోడా ఇండియా వంటి సంస్థలు కూడా రికార్డు విక్రయాలు సాధించాయి.
కార్లు, ఎస్యూవీ, వ్యాన్లను కలిపి ప్రయాణికుల వాహనాలుగా పరిగణిస్తున్నారు. మొత్తం ప్రయాణికుల వాహన విక్రయాల్లో ఎస్యూవీల వాటా 42.3 శాతానికి పెరిగింది. రూ.10 లక్షలు, అంతకుమించి విలువైన కార్ల అమ్మకాలే… మొత్తం విక్రయాల్లో 40 శాతం మేర ఉన్నాయి. కరోనా సంబంధిత సమస్యలు, సెమీకండక్టర్ల కొరత తగ్గిపోవడం… వాహన విక్రయాలకు కలిసొచ్చింది.
2022లో మారుతీ సుజుకీ 15.76 లక్షల వాహనాలు విక్రయించింది. 2021లో అమ్మిన 13.64 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 16 శాతం అధికం. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 5,05,033 నుంచి 9.4 శాతం పెరిగి 5,52,511కు చేరాయి. టాటా మోటార్స్ మొత్తం 5,26,796 వాహనాలు అమ్మింది. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 1,30,768 యూనిట్ల నుంచి 23 శాతం వృద్ధితో 1,60,357 వాహనాలకు పెరిగాయి. స్కోడా కార్లు 2021తో పోలిస్తే 2022లో ఏకంగా రెట్టింపు కన్నా ఎక్కువగా అమ్ముడుపోయాయి. 23,858 యూనిట్ల నుంచి 53,721కు పెరిగాయి. ఇక హోండా… 2021లో అమ్మిన 89,152 యూనిట్లతో పోలిస్తే… 2022లో 7 శాతం ఎక్కువగా 95,022 కార్లు అమ్మింది.