Soil Health:- మట్టి అనేది మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందులో పండుతున్న ఆహార పదార్థాలను తినే మానవాళి జీవనం కొనసాగిస్తోంది. అయితే ఈ రోజుల్లో పంటలు పండించడానికి ఎన్నో కృత్రిమ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ మట్టి ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తున్నాయి. అందుకే మట్టి ఆరోగ్యం కోసం పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలతో కలిసి పాటుపడుతున్నారు. తాజాగా మరో కొత్త విధానంతో మట్టి ఆరోగ్యంపై పరిశోధనలు చేపట్టారు.
ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కనుక్కోవడానికి ఇప్పటికే శాస్త్రవేత్తల దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి. తాజాగా మరో కొత్త పద్ధతితో వారు మట్టితో పాటు పూర్తి ఎకోసిస్టమ్ ఆరోగ్యం గురించి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆడియో టెక్నాలజీ. ఈ ఆడియో టెక్నాలజీ అనేది మట్టిలో ఏర్పాటు చేసినప్పుడు దాని ద్వారా వినిపించే శబ్దాలను బట్టి మట్టి ఆరోగ్యాన్ని కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త రకం టెక్నాలజీని యూకే, ఆస్ట్రేలియన్ ఎకాలజిస్ట్స్ కలిసి కనిపెట్టారు.
అడవుల గురించి, అందులో జీవించే జీవరాశుల గురించి తెలుసుకోవడానికి ఎప్పటికీ వాటిని కనిపెడుతూ ఉండడమే కరెక్ట్ పద్ధతి అని ఎకాలజిస్ట్స్ చెప్తున్నారు. అడవుల నుండి వినిపంచే శబ్దాలు ఫార్మింగ్ వల్ల, మైనింగ్ వల్ల అడవులు ఎంతగా దెబ్బతింటున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు. దీని ద్వారా అడవులను మళ్లీ పచ్చదనంతో ఎలా నింపాలో ఆలోచించే అవకాశం ఉంటుందన్నారు. మట్టి ఆరోగ్యంగా ఉన్న ప్రాంతంలో శబ్దాలు ఏ భంగం లేకుండా వినిపిస్తాయని వారు బయటపెట్టారు.
వానపాముల దగ్గర నుండి చెట్ల మూలాల వరకు చాలావరకు మట్టి లోపలే పెరుగుతాయి కాబట్టి మట్టి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని ఎకాలజిస్ట్స్ అంటున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఆడియో టెక్నాలజీని ఉపయోగించి అడవుల ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. స్పెషల్ మైక్రోఫోన్స్ ద్వారా దాదాపు 200 సౌండ్ శాంపిల్స్ను ఎకాలజిస్ట్స్ సేకరించారు. అవి ఒక్కొక్కటి దాదాపు 3 నిమిషాల నిడివి ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఈ టెక్నాలజీ చేరనుంది.