అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం దెబ్బకు స్టాక్ మార్కెట్లు గత మూడు సెషన్లలో కుదేలయ్యాయి. ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయల సంపద కోల్పోయారు. పరిస్థితి చూస్తుంటే… మరికొన్నాళ్లు స్టాక్ మార్కెట్లలో కల్లోలం తప్పని సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వచ్చే ఫిబ్రవరి 1న, బుధవారం నాడు కేంద్రం బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఆ రోజుతో పాటు మరికొన్నాళ్ల పాటు మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు అయితే ఫరవాలేదు కానీ, ఇంట్రా డే ట్రేడింగ్ చేసే వాళ్లు మాత్రం… బడ్జెట్ కారణంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే మార్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించినప్పుడే నష్టాల బారి నుంచి తప్పించుకోగలరు.
గత 12 బడ్జెట్ల సమయంలో మార్కెట్లు కదలాడిన తీరు చూస్తే… 6 సార్లు మాత్రమే సూచీలు సానుకూలంగా స్పందించాయి. 6 సార్లు నష్టపోయాయి. కొన్ని సందర్భాల్లో ఈ నష్టాలు నెల రోజులకు పైగా సాగాయి కూడా. 2020లో కరోనాకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు 2.5 శాతం నష్టపోయిన సూచీలు… 2021లో మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఏకంగా 4.7 శాతం లాభపడ్డాయి. 2013లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ దలాల్ స్ట్రీట్ను ఏ మాత్రం ఆకర్షించలేకపోయింది. ఆ రోజు సూచీలు 2 శాతం మేర కుంగాయి. 2014లో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కూడా ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో అమ్మకాల ఒత్తిడి తప్పలేదు. 2015లో బడ్జెట్ రోజు ఉరకలేసిన మార్కెట్లు… ఆ తర్వాత దారుణంగా పతనమయ్యాయి. నెల రోజుల్లో ఏకంగా 4.5 శాతానికి పైగా కుంగాయి. 2016లో మాత్రం బడ్జెట్ నాడు నీరసపడిన సూచీలు… ఆ తర్వాత నెలరోజులు పాటు దూకుడుగా దూసుకెళ్లింది. ఏకంగా 10 శాతానికిపైగా లాభపడింది.
ఇక రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ… 2017లో ఒకే బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడు మార్కెట్లు 2 శాతం మేర లాభపడ్డాయి. జీఎస్టీని ప్రవేశపెడుతూ 2018లో బడ్జెట్ ప్రకటించిన నాడు.. సూచీలు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నా… ఆ తర్వాత నెల రోజుల్లో 6 శాతానికి పైగా పతనమయ్యాయి. 2019లో తాత్కాలిక బడ్జెట్ ప్రకటించిన రోజు కాస్త లాభపడ్డ మార్కెట్లు… రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున… ఒక శాతానికిపైగా కుంగింది. చాలా విషయాల్లో నిర్మలా సీతారామన్ స్పష్టత ఇవ్వకపోవడంతో… వరుసగా నెలరోజుల పాటు సూచీలు తిరోగమన దిశగానే పయనించాయి. ఏకంగా 8 శాతానికి పైగా కుంగాయి.