Delhi Liquor Case : ఢిల్లీ మద్యం స్కామ్ లో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుపై ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఛార్జిషీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి పేర్లు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. అలాగే మద్యం స్కామ్ లో బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్పిళ్లై పోషించిన పాత్రను ఈడీ ఛార్జిషీట్ లో పేర్కొంది. ఇప్పటివరకు అరెస్టయిన సమీర్ మహేంద్రు, పి.శరత్చంద్రారెడ్డి, బినయ్బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్ నుంచి తీసుకున్న స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ ఈ ఛార్జిషీట్ రూపొందించింది.
ఛార్జ్ షీట్ లో ఏముందంటే..
మాగుంట రాఘవరెడ్డి, కవిత భాగస్వాములుగా ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థ.. 14,05,58,890 సీసాల మద్యం విక్రయించింది. దీని ద్వారా రూ.192.8 కోట్లు సంపాదించింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి, కవిత నియంత్రణలో ఉన్న సౌత్గ్రూప్.. ఆప్ నాయకుల కోసం రూ.100 కోట్ల ముడుపులు విజయ్ నాయర్కు ఇచ్చింది. సౌత్గ్రూప్-ఆప్ నేతల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ముడుపులను ముందస్తుగా చెల్లించింది. ప్రతిఫలంగా సౌత్గ్రూప్నకు ప్రయోజనాలు చేకూరాయి. ముడుపుల రూపంలో ఇచ్చిన రూ.100 కోట్లను రాబట్టుకొనేందుకు వీలుగా ఇండోస్పిరిట్లో 65% వాటాను సౌత్గ్రూప్నకు ఇచ్చింది. ఇండోస్పిరిట్లోని వాటాను పాత్రధారులు అరుణ్పిళ్లై, ప్రేమ్ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో సౌత్గ్రూప్ నడిపింది. ఈ కేసులో పాత్ర ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు.
ఈ ఏడాది జనవరిలో కవితతో హైదరాబాద్లోని ఆమె ఇంట్లో సమీర్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో శరత్చంద్రారెడ్డి, అరుణ్పిళ్లై, అభిషేక్, కవిత భర్త అనిల్ పాల్గొన్నారు. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.10 వేల కోట్ల ఆదాయం ఉందని, అందువల్ల బడావ్యక్తులు కావాలని ఆప్ బినామీ విజయ్ నాయర్ అరుణ్పిళ్లైతో చెప్పారు. ఈ తరుణంలో శరత్చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంపై ఆసక్తి చూపారు. ఆ నేపథ్యంలోనే ఆయన బుచ్చిబాబును ఆర్థికవనరులు, మార్కెటింగ్ విశ్లేషణ కోసం తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ ఈడీ పొందుపర్చిన ఛార్జీ షీట్ లో ఉన్నాయి.
సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 3 వేల పేజీల ఈ ఛార్జిషీట్ను నవంబర్ 26న ఈడీ దాఖలు చేసింది. ఈ అంశంపై ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ మంగళవారం విచారణ చేపట్టారు. సమీర్ మహేంద్రు విచారణకు హాజరయ్యారు. ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన తర్వాత వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రత్యేక జడ్జి ప్రకటించారు. ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5 లోపు చెప్పాలని ప్రతివాదులు సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం తయారీ, సరఫరా సంస్థలను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
ఢిల్లీ మద్యం స్కామ్ లో సాక్షిగా ఇప్పటికే కవిత స్టేట్ మెంట్ ను సీబీఐ రికార్డు చేసింది. అవసరమైతే మళ్లీ విచారణకు వస్తామని తెలిపింది. తాజాగా ఈడీ ఛార్జిషీట్ లో కవిత పేరు ఉండటంతో అటు సీబీఐ, ఇటు ఈడీ విచారణకు కవిత సిద్ధం కావాల్సిందేనని స్పష్టమవుతోంది. అటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడి పేర్లు ఛార్జిషీట్ లో ఉండటంతో ఏపీలోనూ మద్యం స్కామ్ ప్రకంపనలు రేగుతున్నాయి. మరి సీబీఐగానీ, ఈడీగానీ ఏపీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాయనే ఉత్కంఠ నెలకొంది.