ఈ లెక్కలేంటని అనుకుంటున్నారా? గత ఐదేళ్లలో దేశంలోని వంద కంపెనీలు పోగేసిన సంపద విలువ… ఏకంగా రూ.92 లక్షల కోట్లుగా తేలింది. దేశ చరిత్రలోనే ఇది ఓ సరికొత్త రికార్డు. అన్ని కంపెనీలను అధిగమించి… ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ సంపదను పోగేసి అన్ని రికార్డులనూ బద్దలుకొట్టింది. అయితే…. గత ఏడాది కాలంగా అదానీ గ్రూప్ కంపెనీలు ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరాయి.
ఏటికేడు సంపద సృష్టిలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు వివిధ ఆస్తుల కొనుగోలుతో పాటు, కొత్త రంగాల్లోకి ప్రవేశించడంతో… గౌతమ్ అదానీ సంపద 150 బిలియన్లు దాటిపోయింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో… ఏకంగా 70 బిలియన్ డాలర్ల సంపదను జమ చేసుకున్నారు… గౌతమ్ అదానీ. గ్రూప్ కంపెనీలైన అదానీ టోటల్ గ్యాస్, గ్రీన్ ఎనర్జీతో పాటు ఫోర్బ్స్ లోనూ 65 % వాటాతో గౌతమ్ అదానీ ఎక్కువ సంపదను సృష్టించారు. ఇక ముకేశ్ అంబానీ మొత్తం సంపద విలువ 92.3 బిలియన్ డాలర్లకు చేరింది.
2017–22 మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యంత వేగంగా, నిలకడగా ఎదిగిన భారీ కంపెనీలుగా నిలిచాయి. రంగాల వారీగా చూస్తే… గత ఐదేళ్ల కాలంలో టెక్నాలజీ, ఫైనాన్షియల్స్ తొలి రెండు ర్యాంకులు సాధించాయి. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఐదేళ్లలో, నాలుగేళ్ల పాటు అత్యధిక సంపదను సృష్టించిన దిగ్గజంగా ఆర్ఐఎల్ ఆవిర్భవించగా… అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఐదేళ్లలో నిలకడైన సంపద సృష్టికి నిదర్శనంగా నిలిచింది. ఓ వైపు పెద్ద నోట్ల రద్దు, మరోవైపు కొవిడ్ కారణంగా గత ఐదేళ్లలో చాలా మంది సామాన్యులు, కంపెనీలు కుదేలవగా… బడా కంపెనీలు మాత్రం లక్షల కోట్ల సందపను పోగేసుకోవడం విశేషం.