Amazon : ఖర్చులు తగ్గించి, పొదుపుపై దృష్టి పెట్టిన దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్… భారత వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భారీగా ఉద్యోగుల తొలగింపుతో పాటు ఎడ్యుటెక్, ఫుడ్ డెలివరీ వ్యాపారాలను మూసివేసిన అమెజాన్… తాజాగా హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్లో వారం వ్యవధిలో ఏకంగా మూడు వ్యాపార కార్యకలాపాల్ని నిలిపివేసింది… అమెజాన్. నవంబరు 24న ఎడ్యుటెక్, నవంబరు 25న ఫుడ్ డెలివరీ వ్యాపారాలు మూసివేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్… నవంబర్ 28న హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారానికి మంగళం పాడుతున్నామని వెల్లడించింది.
ప్రధానంగా బెంగళూరు, మైసూరు, హుబ్లీ నగరాల్లో హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తోన్న అమెజాన్… వెబ్సైట్ ద్వారా చిన్న వ్యాపారులు హోల్సేల్ ధరలకే ఉత్పత్తులను కొనుక్కునే అవకాశం కల్పించింది. అయితే, ఈ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో, మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వార్షిక కార్యకలాపాల సమీక్ష ప్రక్రియలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాము నిర్ణయాలను అనాలోచితంగా తీసుకోవడం లేదని… ప్రస్తుత కస్టమర్లు, భాగస్వాములను దృష్టిలో పెట్టుకుని వ్యాపార కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేస్తామని అమెజాన్ తెలిపింది. మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు అండగా ఉంటామని, కస్టమర్లకు అత్యుత్తమ ఆన్లైన్ షాపింగ్ సేవలు అందించడంపై పూర్తిగా దృష్టిపెట్టామని ప్రకటించింది.
దేశంలో కొవిడ్ విజృంభణ సమయంలో జనం ఎవరూ బయట తిరిగే పరిస్థితి లేకపోవడంతో… హోం డెలివరీ సేవలు, ఆన్లైన్ లెర్నింగ్ తప్పనిసరి అయ్యాయి. దాంతో… జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లకు పోటీగా 2020 మేలో అమెజాన్ ఫుడ్ పేరుతో డెలివరీ సేవలను ప్రారంభించింది… అమెజాన్ ఇండియా. బెంగళూరు సహా కొన్ని నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కానీ… స్విగ్గీ, జొమాటోతో పాటు డుంజో, ఉబర్ ఈట్స్ వంటి స్టార్టప్ల కారణంగా పోటీ విపరీతంగా పెరిగి ఆశించిన మేరకు ఆదాయం రాలేదు. దాంతో… రెండున్నరేళ్లకే ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మూసివేసింది… అమెజాన్. అలాగే విద్యాసంస్థలు నడిచే పరిస్థితులు లేని సమయంలో ప్రారంభించిన అమెజాన్ అకాడమీని కూడా… తాజాగా క్లోజ్ చేసింది.