Amazon : పొదుపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్… దేశంలో తన లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ అకాడమీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది మొదట్లో భారత్లో లెర్నింగ్ ప్లాట్ఫాంను తీసుకువచ్చిన అమెజాన్ సంస్థ… ఇప్పుడు వివిధ కారణాలతో దాన్ని మూసివేస్తోంది.
భారత్లో హైస్కూల్ విద్యార్థుల కోసం లెర్నింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది… అమెజాన్. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో అకాడమీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ను అందిస్తోంది. అయితే ఇప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత… అమెజాన్ అకాడమీని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చామని సంస్థ ఓ ప్రకటన చేసింది. అయితే ఒకేసారి కాకుండా… ప్రస్తుతం ఉన్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని… దశల వారీగా నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపింది.
కరోనా కష్టకాలం ముగియడంతో… ఇప్పుడు విద్యాసంస్థలన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. దాంతో ఆన్లైన్ విద్యకు డిమాండ్ తగ్గిపోయి, అది అందిస్తున్న సంస్థలకు మనుగడ కష్టంగా మారింది. తగినంత ఆదాయం లేకపోడవడంతో ఇప్పటికే బైజూస్, అన్అకాడమీ, వైట్హ్యాట్ జూనియర్ వంటి సంస్థలు వేల మంది ఉద్యోగుల్ని తీసివేశాయి. కానీ… అమెజాన్ మాత్రం ఏకంగా అకాడమీ దుకాణాన్ని సర్దేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
మరోవైపు ఉద్యోగుల్ని తొలగిస్తున్న అమెజాన్… స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వేతన సంబంధిత ప్రయోజనాలు తీసుకొని వెళ్లిపోవాలని కొందరు భారతీయ ఉద్యోగులకు సూచించిందని చెబుతున్నారు. సంస్థే కాంట్రాక్టును రద్దు చేయడానికి బదులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పడంతో… భారత ఉద్యోగులు వాలంటరీ సెపరేషన్ ప్రొగ్రామ్-VSP వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ప్లాన్కు సానుకూలంగా ఉన్నవాళ్లు నవంబర్ 30కల్లా దానిపై సంతకం చేయాలని అమెజాన్ గడువు విధించింది. ఆ లోగా సంతకం చేసిన వాళ్లే వేతన ప్రయోజనాలకు అర్హులని సంస్థ చెప్పినట్లు సమాచారం.