Amarnath Yatra: షెడ్యూల్ ప్రకారం ఈసారి కూడా అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి విడతలో 3488 యాత్రికులు జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ సారి అమర్ నాథ్ యాత్ర 62 రోజులపాటు జరగనుంది. భారీ భద్రత మధ్య అమర్ నాథ్ యాత్రికుల మంచు శివలింగ దర్శన యాత్ర జరుగుతుంది. అమర్ నాథ్ యాత్రికుల కోసం షాలిమార్ లోస్పాట్ రిజిస్ట్రేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. సాధువుల కోసం పురానీమండీలో మరో రిజిస్ట్రేషన్ కేంద్రం కూడా సిద్దం చేశారు. అమర్ నాథ్ యాత్ర కోసం ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య దాదాపు 3 లక్షలు దాటిపోయింది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఈసారి అమర్ నాథ్ యాత్రికులు వెంట తీసుకెళ్లే వస్తువుల విషయంలో కొన్ని ఆంక్షలు పెట్టారు. కొన్ని ఆహారపదార్ధాల్ని తీసుకురావడాన్ని నిషేధించారు. పర్యాటక ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి నిబంధనలు అమలు చేయడం సాధారణమైన విషయమే. అమర్ నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు యాత్రికుల కోసం ఆరోగ్య సలహాలు జారీ చేసింది. అన్ని రకాల మాంసాహార పదార్థాలు, పలావ్,ఫ్రైడ్ రైస్, దోస, పూరి, పరాటా, కూరగాయలు పచ్చళ్ళు, ఫ్రైడ్ పాపడ్, పిజ్జాలు, బర్గర్లు, నిషేధించారు. క్రీమ్స్ తో తయారు చేసే ఫుడ్స్ , ఫాస్ట్ ఫుడ్స్, హల్వాలు,జిలేబి, గులాబ్ జామ్, బర్ఫీ,రసగుల్లా, కూల్ డ్రింక్స్, నిషేధించిన ఆహార పదార్థాల్లో ఉన్నాయి. అలాగే ఆల్కహాల్, గుట్కా,పాన్ మసాలా,పొగాకు వంటివి కూడా నిషిద్ధమే. సమోసా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా వెంట తీసుకురావద్దని బోర్డు సూచించింది.
ఆగస్టు 31 వరకు అమర్ నాథ్ యాత్ర కొనసాగనుంది. మంచు శివలింగం దర్శనం కోసం ఎంతో క్లిష్టమైన యాత్రను చేసేందుకు భక్తులు ఉత్సాహంగా వస్తుంటారు. ప్రతికూలమైన వాతావరణం మధ్య అమర్ నాథ్ యాత్ర ఆద్యంతం సాగుతుంది. సవాళ్లతో కూడుకున్న జర్నీలో అమర్ నాథ్ యాత్రికులు 14వేల అడుగుల ఎత్తున పర్వత ప్రాంతంలోను మంచు శివ లింగాన్ని దర్శించుకుంటారు. ఏడాదికోసారి మాత్రమే ఏర్పడే మంచు శివలింగ దర్శనం భక్తులకి ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుందని నమ్మకం. గుండె ,శ్వాస సంబంధింత సమస్యలు ఉన్న వారు వయసు పైబడిన వారు ఈ యాత్రకి దూరంగా ఉండాలి.