Alzheimer’s : మనసులో ఏముందో కళ్లలో చూసి చెప్పేయవచ్చని చాలామంది అంటుంటారు. కానీ వ్యాధి అనేది బయటికి రాకముందే కళ్లను చూస్తే తెలిసిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక వ్యాధి అనేది మన ఒంటిలో బయటపడక ముందే కళ్లను చూసి కనిపెట్టేయవచ్చని వారు తెలిపారు. అలా కళ్లు చూసి కనిపెట్టే వ్యాధుల్లో కొన్ని క్లిష్టమైనవి ఉంటాయని తెలుస్తోంది. దానికి ఉదాహరణే అల్జీమర్స్. అల్జీమర్స్ను కనిపెట్టడానికి కళ్లు కూడా ఉపయోడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మామూలుగా మనిషి ఆరోగ్యం క్షీణిస్తే.. ముందుగా వైద్యులు కళ్లనే చూస్తారు. అది వారి లోపలి ఆరోగ్యానికి అద్దం పడుతుంది. కళ్లు అనేవి మెదడుకు విండోలాగా పనిచేస్తాయని ఆప్థమాలజిస్ట్స్ అంటున్నారు. కంటి వెనుక భాగాన్ని పరీక్షించి చూస్తే.. నెర్వస్ సిస్టమ్ను చూడవచ్చని మరికొందరు వైద్యులు చెప్తున్నారు. అల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన క్లిష్టమైన వ్యాధుల్లో ఒకటి. అయితే అల్జీమర్స్ బయటపడకముందే మెల్లగా మెదడులో ఈ వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు మొదలవుతాయని పరిశోధనల్లో తేలింది.
అల్జీమర్స్ బయటపడకముందే కళ్ల సాయంతో అది వచ్చే సూచనలను తెలుసుకోవచ్చని తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. మామూలుగా మెమరీ లాస్ అనేది అల్జీమర్స్కు సూచన అని అంటుంటారు. కానీ మెమరీ లాస్ అనేది ప్రారంభం అవ్వడం కంటే ఎన్నో ఏళ్ల ముందే దీనికి సంబంధించిన మార్పులు మెదడులో మొదలువుతాయి. మానసిక వ్యాధులతో బాధపడుతున్న 86 మంది కంటిని శాస్త్రవేత్తలు పరీక్షించి చూశారు. దీని వల్ల మెదడులో జరిగే మార్పులు ఏంటని వారు గమనించారు. కంటి పరీక్షలు చేసిన తర్వాత అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉన్నవారికి కంటిలో బెటా ఆమిలాయిడ్ అనే టిష్యూ పెరుగుతుందని, అల్జీమర్స్ రావడానికి అదే ముఖ్య కారణమని వారు గమనించారు.
కంటిలో మైక్రోగ్లియల్ సెల్స్ అనేవి అల్జీమర్స్ వచ్చేవారిలో 80 శాతం తగ్గిపోతాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఇవి బెటా ఆమిలాయిడ్ సెల్స్ను తగ్గించడంలో సహాపడతాయి. కానీ ఇవే తగ్గిపోవడం వల్ల అల్జీమర్స్కు దారితీసే అవకాశాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఆమిలాయిడ్ బెటా చుట్టూ ఎన్నో ఇమ్యూన్ సెల్స్ చేరుకోవడం వల్ల టిష్యూల సంఖ్య తగ్గిపోవడానికి ఇవి కారణమవుతున్నాయని తెలిపారు. ఇదే కోణంలో కంటి పరీక్షలు డెవలప్ అయితే.. కేవలం కళ్ల పరీక్షలు చేసి అల్జీమర్స్ను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.