PAN Card: దేశంలో అన్ని వ్యాపారాలను మరింత సరళతరం చేసేందుకు వీలుగా… బడ్జెట్లో కీలక చర్యలు చేపట్టింది… కేంద్రం. 13 రకాలకుపైగా గుర్తింపు కార్డులకు బదులు… ఒక్క పాన్ కార్డుకే అన్ని రకాల అనుమతులూ మంజూరు చేయబోతోంది. ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని పలు రకాల డిజిటల్ వ్యవస్థలు… ఇకపై పాన్ ఒక్కదాన్నే గుర్తింపు కార్డుగా స్వీకరిస్తాయి.
ఇప్పటిదాకా అన్ని రకాల వ్యాపారాలకు వివిధ అనుమతులు ఇచ్చేందుకు 13 రకాలకు పైగా కార్డులను సమర్పించాల్సి వచ్చేది. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి, జీఎస్టీఎన్, టిఐఎన్, టిఎఎన్, పాన్ వంటి వాటిని చూపి వ్యాపార సంస్థలు అనుమతుల తెచ్చుకునేవి. కానీ, ఇకపై పాన్ కార్డును మాత్రమే స్వీకరించి అనుమతులు మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ అనుమతులు, క్లియరెన్స్ల కోసం… జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను తెచ్చే దిశలో ఇది ఒక ముందడుగని కేంద్రం పేర్కొంది.
మరోవైపు… దేశంలో వాణిజ్య వాతావరణాన్ని కూడా మరింత మెరుగుపరిచేందుకు… నిబంధనల్ని సడలించింది… కేంద్రం. గత డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ బిల్లుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. భారత్లో వ్యాపారం చేయాలంటే వివిధ రకాల చట్టాల ప్రకారం వేల నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి ఇప్పటిదాకా ఉండేది. చిన్న నిబంధన ఉల్లంఘించినా క్రిమినల్ కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితులకు భయపడుతున్న చాలా మంది వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు… దేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా… బడ్జెట్లో దాదాపు 39 వేల నిబంధనలను తొలగించింది… కేంద్రం. అంతేకాదు… 3,400 రకాల చిన్నచిన్న ఉల్లంఘనలను డీక్రిమినలైజ్ చేసింది. అంటే… ఆయా నేరాలకు జైలు శిక్షలు విధించకుండా… జరిమానా వంటి చర్యలతో సరిపెడతారు. మొత్తం 42 చట్టాల్లోని నిబంధనలను తొలగించి, సవరించి… వ్యాపారాలను మరింత సులభతరం చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని కేంద్రం తెలిపింది.