Air India:ఈ బంపరాఫర్ ఎవరికో తెలుసా? ఎయిరిండియాలో చేరబోయే పైలెట్లకు. గతంలో చాలా విమానయాన సంస్థలు సరిగ్గా జీతాలివ్వడం లేదని సిబ్బంది తరచూ ఆందోళనకు దిగేవాళ్లు. అలాంటి రంగంలో పైలెట్లకు ఇంత భారీ జీతం ఆఫర్ చేసి సంచలనమే సృష్టించింది… ఎయిరిండియా. ఇటీవలే కొత్త విమానాల కొనుగోలు కోసం బోయింగ్, ఎయిర్బస్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ఎయిరిండియా… వాటిని నడిపే పైలెట్లు, ఇతర సిబ్బంది కోసం అన్వేషణ మొదలుపెట్టింది.
బోయింగ్ నుంచి రాబోయే B777 విమానాలు నడిపేందుకు B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది… ఎయిరిండియా. నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం… ఎంపికైన పైలెట్లకు నెలకు 21 వేల డాలర్లు చెల్లిస్తామని ప్రకటించారు. అంటే… మన కరెన్సీలో దాదాపు రూ.17.4 లక్షలు. ఆ లెక్కన ఏడాదికి రూ.2 కోట్లకు పైమాటే. నైపుణ్యం కలిగిన పైలట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నందువల్లే… ఎయిరిండియా ఇంత భారీ జీతాన్ని ఆఫర్ చేసిందని నిపుణులు అంటున్నారు. కనీసం 5 వేల నుంచి 7 వేల గంటలు విమానం నడిపిన అనుభవం ఉన్న పైలెట్లకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని చెబుతున్నారు.
ఒక్క పైలెట్లకే కాదు… క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇతర సాంకేతిక నిపుణుల నియామకాల కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది… ఎయిరిండియా. షిఫ్టుల ప్రకారం ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు, దాదాపు 50 మంది క్యాబిన్ సిబ్బంది, మెయింటెనెన్స్ ఇంజనీర్లు, చెకౌట్ కౌంటర్ల సిబ్బంది, బ్యాగేజీ హ్యాండ్లర్లు అవసరమవుతారు. ఎయిరిండియా ఆర్డర్ ఇచ్చిన కొత్త విమానాలు వస్తే… వాటి సర్వీసుల కోసం మొత్తం 2 లక్షల మంది కొత్త ఉద్యోగుల అవసరం ఉంటుందని అంచనా. ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్న వేళ… టాటాల ఆధర్వంలోని ఎయిరిండియా… ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించడం నిజంగా గొప్ప విషమంటున్నారు… నిపుణులు.