media : కృత్రిమంగా ఆలోచించే ఒక పరికరం ఉన్నప్పుడు మానవ మేధస్సుతో పనేముంది అని కొందరు అనుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ రంగ సంస్థలు తక్కువలో పని అయిపోతున్నప్పుడు ఎక్కువగా మనుషులకు ఉద్యోగాలు ఇవ్వడం, వారికి జీతం ఇవ్వడం ఎందుకు అనే ఆలోచనలో పడవచ్చు. ప్రస్తుతం అదే జరగనుంది. తాజాగా మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిస్టమ్ మీడియా ఉద్యోగులకు పీడకలగా మారనుంది.
పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన చాట్బోట్ అయిన చాట్జీపీటీ.. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ.. టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఎంత కృత్రిమ మేధస్సు అయినా కూడా మానవ మేధస్సు లాగా ఆలోచించలేదని మరికొందరి నిపుణుల వాదన. అయినా కూడా చాట్జీపీటీ వినియోగంపై ఏ మాత్రం ఎఫెక్ట్ పడడం లేదు. దీని క్రేజ్ చూసి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ టెక్నాలజీ వెంటపడుతున్నారు. తాజాగా మీడియా రంగం కూడా అదే చేస్తోంది.
కేవలం కృత్రిమ మేధస్సును ఉపయోగించి ‘న్యూస్జీపీటీ’ అనే న్యూస్ ఛానెల్ తాజాగా లాంచ్ అయ్యింది. ఇది మీడియా ఉద్యోగులను కలవరపెడుతోంది. న్యూస్ జీపీటీ సీఈఓ అలాన్ లెవీ చెప్పినదాని ప్రకారం.. న్యూస్ ప్రపంచంలోనే న్యూస్ జీపీటీ ఒక కొత్త సంచలనాన్ని సృష్టించనుంది. చాలాకాలంగా వార్తలనేవి పక్షపాతంగా మారుతున్నాయని, కానీ న్యూస్ జీపీటీ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు రిపోర్ట్ చేస్తుందని ఆయన అన్నారు. రిపోర్టర్లు అనేవారు లేకుండా, పక్షపాతం అనేది చూపించకుండా న్యూస్జీపీటీ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
న్యూస్జీపీటీ.ఏఐ వెబ్సైట్లో వార్తలను ఫ్రీగా చదవవచ్చని అలాన్ ప్రకటించారు. పలు ప్రక్రియల ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను సేకరించి, ఆ తర్వాత వాటిని న్యూస్ స్టోరీలుగా మార్చి అందించనుంది న్యూస్జీపీటీ. పైగా ఈ వెబ్సైట్ ఎప్పుడూ అప్డేట్లో ఉంటుందని అలాన్ తెలిపారు. సోషల్ మీడియా, ఇతర న్యూస్ వెబ్సైట్స్, ప్రభుత్వ ఏజెన్సీల నుండి వచ్చే ప్రతీ సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే న్యూస్జీపీటీ పబ్లిష్ చేస్తుందన్నారు.
రాజకీయాలు, ఎకానమిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ప్రతీ టాపిక్ గురించి న్యూస్ జీపీటీలో సమాచారం దొరుకుతుందని అలాన్ లెవీ తెలిపారు. ఏ కారణాల వల్ల కూడా న్యూస్ జీపీటీ పక్షపాతంగా మారదని ఆయన హామీ ఇచ్చారు. కేవలం యూజర్లకు కచ్చితమైన సమాచారాన్ని, నిజమైన వార్తను అందించడమే దాని లక్ష్యమన్నారు. అందరికీ పక్షపాతం లేని సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉందని, అందుకే న్యూస్ జీపీటీ అనేది ప్రారంభించామని అలాన్ కచ్చితంగా చెప్పారు.