Climate Changes:కాలుష్యాల వల్ల, ఇతర కారణాల వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, అవి మానవాళికి ప్రమాదకరంగా మారుతాయని పరిశోధకులు ఎప్పటినుండి హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కూడా ఈ కోణంలో పరిశోధనలు మొదలయ్యాయి. అందులో పరిశోధకులకు వాతావరణ మార్పుల గురించి మరిన్ని నిజాలు తెలిసాయి.
దాదాపు ఒక దశాబ్దంలో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయని వాతావరణ నిపుణులు ఇప్పటికే చెప్తున్నారు. కానీ 2050 వచ్చేసరికి వాతావరణ మార్పులు చేయిదాటిపోయేలా ఉన్నాయని కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా చేసిన పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు చేసిన పరిశోధనల కంటే ఏఐతో చేసిన పరిశోధనల్లోనే ఎక్కువ హెచ్చరికలు కనిపించినట్టుగా శాస్త్రవేత్తలు అంటున్నారు.
గ్లోబల్ వార్మింగ్ వల్లే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. దాని వల్లే మానవాళికి ఇబ్బందులు రానున్నాయి. ఇదంతా తెలిసిన విషయమే. అయితే ఇప్పటికైనా గ్లోబల్ వార్మింగ్ను కంట్రోల్ చేయవచ్చా లేదా అన్న అంశంపై పర్యావరణవేత్తలు చర్చలు మొదలుపెట్టారు. 2015లో చేసిన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం గ్లోబల్ వార్మింగ్ను 1.5 డిగ్రీ సెల్సియస్ తగ్గించే అవకాశం ఉందా అనేదానిపై వారు చర్చలు జరుపుతున్నారు.
19వ శతాబ్దం ప్రారంభమయినప్పటి నుండే పరిశ్రమల వల్ల, కాలుష్యాన్ని వదిలే ఇండస్ట్రీల వల్ల గ్లోబల్ వార్మింగ్ శాతం 1.1 నుండి 1.2 మధ్యలో ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే 2033 నుండి 2035 మధ్యలో భూమి 1.5 డిగ్రీల మార్క్ను చేరుకుంటుందని క్లైమేట్ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలింది. దాదాపుగా ఇదే జరగనుందని వారు కచ్చితంగా చెప్తున్నారు. 1.5 డిగ్రీల మార్క్ను చేరుకున్న తర్వాత పర్యావరణవేత్తలు మరో టార్గెట్ను పెట్టుకొని పనిచేయవలసి ఉంటుందని వారు సూచించారు.
కాలుష్యం పెరుగుతున్నా కూడా.. భూమి ఎప్పుడూ 2 డిగ్రీల మార్క్ను దాటకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ ఏఐ మాత్రం ఇది అసాధ్యమైన పనేనని చెప్తోంది. 2050 వరకు భూమి 2 డిగ్రీల మార్క్ను టచ్ చేస్తుందని ఏఐ తేల్చింది. ఒకవేళ అప్పటికి కాలుష్యం అనేది తగ్గితే 2054 వరకు అదే ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది. కానీ అమెరికా చేసిన పరిశోధనల్లో దీనికి భిన్నంగా రిజల్ట్ వచ్చింది.
2090 వరకు భూమి 2 డిగ్రీల ఉష్ణోగ్రతను చేరుకోదని యూఎస్ ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ తెలిపింది. కొందరు పర్యావరణవేత్తలు కూడా దీనికి అంగీకరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చెప్పినదానికంటే అమెరికా పరిశోధనల్లో తేలిందే జరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఏఐను పూర్తిగా నమ్మే అవకాశం లేదని వారు అంటున్నారు.