AI Based News Reporter: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందింది. దీని వల్ల అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు.. తమ ఉద్యోగం పోయే ముప్పు పొంచి ఉందని నిపుణులు ముందు నుండి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక మీడియా కూడా దానికి మినహాయింపు కాదని అంటూనే ఉన్నారు. వారు హెచ్చరించినట్టుగానే పూర్తిగా ఏఐ సామర్థ్యంతో ఒక న్యూస్ రిపోర్టర్ క్రియేట్ అయ్యింది. తాజాగా దీనిపై టెస్టింగ్ కూడా పూర్తయ్యింది.
ఏఐ సామర్థ్యాన్ని మీడియా, జర్నలిజం రంగంలో ఉపయోగించడం మొదలుపెడితే.. చాలామంది జర్నలిస్టులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్పిన మాట నిజంగా మారుతుందనే భావన చాలామందిలో మొదలయ్యింది. ఎందుకంటే స్కై న్యూస్ అనే మీడియా సంస్థ.. తాజాగా ఏఐ సామర్థ్యంతో తయారైన న్యూస్ రిపోర్టర్ను టెస్ట్ చేసి చూసింది. నార్వేజియన్ యూట్యూబర్, కోడర్గా పేరు తెచ్చుకున్న క్రిస్ ఫాగెర్లీతో చేతులు కలిపి చాట్జీపీటీ లాంటి ఇతర ఏఐ టెక్నాలజీల సాయంతో స్కై న్యూస్ సంస్థ.. ఈ న్యూస్ రిపోర్టర్ను తయారు చేసింది.
ఏఐ అనేది వేగంగా పనిచేసే టెక్నాలజీ కాబట్టి కేవలం 20 నిమిషాల్లోనే ఈ న్యూస్ రిపోర్టర్ ఒక స్టోరీని తయారు చేసి, ప్రెజెంట్ చేయగలదని స్కై న్యూస్ చెప్తోంది. ఈ ఏఐ న్యూస్ రిపోర్టర్పై జరిగిన టెస్టింగ్లో కొన్ని కీలక తప్పులు చేసిందని బయటపెట్టింది. విలువైన ఆధారాలను తప్పుగా ప్రెజెంట్ చేసింది. అందుకే న్యూస్ను ఉన్నది ఉన్నట్టుగా ప్రెజెంట్ చేయాలంటే మనుషుల సాయం కచ్చితంగా కావాలని వారు గుర్తించారు. ఎడిటోరియల్, ఎథికల్ తప్పులు జరగకుండా ఉండాలంటే మనుషుల సాయం కావాలని అన్నారు.
చాట్జీపీటీ సాయంతో కేవలం న్యూస్ రిపోర్టర్ను మాత్రమే కాదు.. దానిలోనే ప్రాంప్టర్ టెక్నాలజీని కూడా అమర్చారు. దీంతో న్యూస్ను ప్రెజెంట్ చేసే విషయంలో దానికి అదే ప్రాంప్టింగ్ చెప్పగలదు. ఈ ఏఐ న్యూస్ రిపోర్టర్పై వారు 90 సెకండ్లు టెస్టింగ్ చేశారు. స్టోరీ ఐడియాల విషయంలో ఇది బాగానే పనిచేసినా.. దానిని ప్రెజెంట్ చేసే విషయంలో పలు తప్పులు చేసిందని స్కై న్యూస్ సంస్థ తెలిపింది. ఇకపై కీలకంగా ఉన్న సమాచారం విషయంలో తప్పులు జరగకుండా ఉండేలా ఏఐ న్యూస్ రిపోర్టర్ను మెరుగుపరచాలని నిర్ణయించుకుంది.