AP Cabinet Meeting Key decisions: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉచిత గ్యాస్ సిలిండర్లపై సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు వివరించారు.
దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇవ్వనుందని చెప్పారు. అయితే ఈ సిలిండర్లను ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకటి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మొదట నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్లోకి నగదు జమ చేసేలా నిర్ణయించారన్నారు. ఒకవేళ జమ కాకుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడనుందని వివరించారు.
ప్రతి ఏడాది రూ.2700కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ నెల 31 ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లు ఇచ్చేందుకు ఒక షెడ్యూల్ ను ఖరారు చేశామన్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 1 నుంచి నవంబర్ నెలాఖరు వరకు రెండో సిలిండర్ పంపిణీ చేస్తామని తెలిపారు. డిసెంబర్ నుంచి మార్చి 31 వరకు మూడో సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. సిలిండర్లపై మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా స్పష్టం చేశారు.
Also Read: తీవ్ర తుఫానుగా మారనున్న దానా.. గంటకు 90 నుంచి 120km వేగంతో గాలులు
కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ రద్దుకు ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దుతో ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారం పడుతున్నట్లు అంచనా వేశారు. అంతేకాకుండా శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు సైతం ఆమోదం తెలిపింది. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు, సభ్యుల సంఖ్యను పెంచేందుకు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.