Adani Group : అదానీ అప్పులు భారీగా పెరిగాయి. అదే సమయంలో అప్పులు తీర్చే సామర్థ్యం కూడా పెరిగింది. ఈ మధ్య కాలంలో అప్పులు తీర్చుకుంటూ వస్తున్నప్పటికీ.. అదానీకి ఇంకా రూ.2 లక్షల 30వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఏడాదిలో అదానీ గ్రూప్ కంపెనీల అప్పులు 21 శాతం పెరిగాయి.
ఓవైపు మెల్లమెల్లగా అప్పులు తీరుస్తున్నప్పటికీ.. తీర్చాల్సిన అప్పులు కూడా చాలానే ఉన్నాయి. బాండ్ల ద్వారా తీసుకున్న లోన్లు 2016లో 14 శాతం కాగా.. 2023 మార్చి చివరకు 39 శాతానికి చేరాయి. ఇండియ్ బ్యాంకులు ఇచ్చిన అప్పులు కూడా తక్కువేం కాదు. అదానీ కంపెనీలకు ఎస్బీఐకి రూ.27,000 కోట్ల అప్పు ఇచ్చింది. ఇక అదానీ తీసుకున్న రుణాల్లో ఇంటర్నేషనల్ బ్యాంకుల వాటా 29 శాతంగా ఉంది. అంటే మూడో వంతు రుణాలు విదేశాల నుంచి తీసుకున్నవే.
ప్రస్తుతం అదానీ గ్రూప్ కు అప్పు ఇచ్చే విషయంలో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తరువాత.. అదానీకి ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు, ఇతర సంస్థలు చాలా కఠినంగా ఉంటున్నాయి. అప్పు ఇచ్చే విషయంలో ముందు వెనక ఆలోచిస్తున్నాయి.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ వచ్చాక.. అదానీ గ్రూప్ షేర్లు, డాలర్ బాండ్లు దారుణంగా పతనమయ్యాయి. ఇప్పటి వరకు ఇవి పూర్తిగా కోలుకోనే లేదు. దీంతో రాబోయే కాలంలో అదానీ గ్రూప్ మరింత ఎక్కువమొత్తం డబ్బులు చెల్లించాల్సి రావొచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో రుణ నిష్పత్తి మెరుగుపడుతున్నందున చెల్లించే సామర్థ్యం కూడా పెరిగింది. నికర రుణాలకు, రన్ రేట్ ఎబిటాకు మధ్య నిష్పత్తి 2013లో 7.6 శాతంగా ఉండగా.. 2022-23 నాటికి అది 3.2 శాతానికి పరిమితమైంది. పైగా అప్పులను మరింతగా తగ్గించుకోవాలని అనుకుంటోంది అదానీ గ్రూప్