Cancer Cells : క్యాన్సర్… ఈ పేరువింటే ఎవరిలోనైనా సరే వణుకుపుడుతుంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లు దడపుట్టిస్తాయి. మన దేశంలో గర్భాశయ క్యాన్సర్ రేటు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా క్యాన్సర్లు ప్రాణాంతకమైనవి. అయితే ప్రాథమిక దశలోనే గుర్తించడం, తగిన చికిత్స తీసుకోవడం వల్ల వీటిని నివారించవచ్చు. ప్రాణాపాయం నుంచి బటయపడొచ్చు. ట్రీట్ మెంట్ తోపాటు ఆత్మవిశ్వాసం, కుటుంబసభ్యుల సహకారంతో ఎంతో మంది క్యాన్సర్ ను జయించారు.
క్యాన్సర్ బాధితులకు గొప్ప శుభవార్తను అందించింది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం-బి.హెచ్.యు. ఈ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు గర్భాశయ క్యాన్సర్ కణాలను ఆర్ఎన్ఏతో అంతమొందించే ప్రయోగం చేపట్టారు. అది సక్సెస్ అయిందని ప్రకటించి జీవితంపై ఆశవదులుకునే గర్భాయశ క్యాన్సర్ బాధితుల్లో ఆశలు రేకెత్తించారు. ఈ అధ్యయనం ఫలితాలను క్యాన్సర్ రంగంలో ప్రతిష్టాత్మకమైన జర్నల్ బీఎంసీ క్యాన్సర్ లో ప్రచురించారు. ఈ సరికొత్త అధ్యయనం… గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో సురక్షితమైన మైక్రో ఆర్ఎన్ఏ థెరఫిగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆ జర్నల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ థెరఫీని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తే… ఎంతోమంది గర్భాశయ క్యాన్సర్ బాధితులకు మేలు జరుగుతుంది.
సాధారణంగా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవంటారు నిపుణులు. ఏమాత్రం అనుమానం వచ్చినా… వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ గర్భాశయ క్యాన్సర్ గా నిర్ధారణ అయితే… ఇప్పటికే కీమోథెరఫీ, రేడియో థెరఫీ వంటి పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక తాజా అధ్యయనంలో డాక్టర్ సుమరేంద్ర కుమార్ సింగ్, పి.హెచ్.డి. స్కాలర్ గరిమా సింగ్ పాల్గొన్నారు. వైరల్ జన్యువు (ఈ6)ను మానవ మైక్రో ఆర్.ఎన్.ఎ-34ఏ ద్వారా అణిచివేయవచ్చని గుర్తించారు. ఇది ఆంకోజెనిక్ సెల్ సైకిల్ ఫ్యాక్టర్ ను ఆఫ్ చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను చంపేస్తుందని సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న కీమోథెరఫీ, రేడియోథెరఫీ చికిత్సల వల్ల హానికరమైన, విషపూరితమైన సాధారణ లేదా క్యాన్సర్ కు సంబంధం లేనటువంటి కణాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ప్రస్తుతం కనుగొన్న చికిత్సా విధానం వల్ల దుష్ఫలితాలు ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందంటున్నారు సైంటిస్టులు.