5G Updates : దేశంలో 5G సర్వీసులకు సంబంధించి రెండు కీలక అప్డేట్స్ వచ్చాయి. ఒకటి… గుజరాత్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 5G సేవలు మొదలైతే… రెండోది… అన్ని శాంసంగ్ 5G ఫోన్లూ ఆ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తాయని ఎయిర్టెల్ తెలిపింది.
గుజరాత్లోని 33 జిల్లా కేంద్రాల్లో ‘ట్రూ 5G’ సేవలు అందుబాటులోకి తెచ్చామని రిలయన్స్ ప్రకటించింది. దీంతో జియో ట్రూ 5G సేవలు దేశంలోని 10 ప్రాంతాలకు విస్తరించినట్లైంది. మోడల్ స్టేట్ కింద… గుజరాత్లో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా చాలా రంగాల్లో జియో ట్రూ 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఈ సేవలను దేశం మొత్తం విస్తరింపజేస్తామని రిలయన్స్ తెలిపింది. ఆ సంస్థ ఫౌండేషన్ చేపట్టిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమం కింద ముందుగా 100 స్కూళ్లను డిజిటలైజ్ చేయనున్నారు. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5G సేవలను వివిధ నగరాల్లో దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు తెలిపిన జియో… వెల్కమ్ ఆఫర్లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1GBPS వేగంతో ట్రూ 5G అపరిమిత డేటా పొందవచ్చని ప్రకటించింది.
మరోవైపు… శాంసంగ్ 5జీ ఫోన్ యూజర్లకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా విడుదల చేసిన ఓఎస్ అప్డేట్తో అన్ని శాంసంగ్ 5G ఫోన్లు ఎయిర్టెల్ 5G ప్లస్ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తాయని తెలిపింది. దేశంలో ముఖ్య నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చినా… ఓఎస్ సపోర్ట్ చేయకపోవడంతో కొన్ని స్మార్ట్ఫోన్లలో 5G నెట్వర్క్ పనిచేయడంలేదు. దీంతో మొబైల్ కంపెనీలు ఓవర్ ది ఎయిర్ ఓఎస్ అప్డేట్ను విడుదల చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్ విడుదల చేసిన అప్డేట్తో… ఇకపై అన్ని శాంసంగ్ 5G మోడల్స్లోనూ ఎయిర్టెల్ 5G నెట్వర్క్ పనిచేస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం నాన్-స్టాండలోన్ ద్వారా 5G సేవలు అందిస్తున్న ఎయిర్టెల్… భవిష్యత్తులో స్టాండలోన్ ద్వారా 5G సర్వీసులు అందిస్తామని తెలిపింది.