5G Technology : వ్యవసాయంలో సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కేవలం భారత్లోని శాస్త్రవేత్తలే కాదు.. ఎన్నో ఇతర ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చైనా కూడా ఒకటి. తాజాగా చైనా.. ఒక మోడర్న్ టెక్నాలజీని వ్యవసాయంలో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. నెంబర్ వన్ సెంట్రల్ డాక్యుమెంట్ పేరుతో ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది.
ఇప్పటికే స్మార్ట్ అగ్రికల్చర్ పేరుతో పలు అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీతో దూసుకుపోతున్నాయి. అలాగే చైనా కూడా వ్యవసాయ రంగంలో 5జీని పూర్తిస్థాయిలో వినియోగించి.. ఆ రంగాన్ని మరింత మెరుగుపరచాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనాలోని యాంజిన్ కౌంటీలో ముందుగా ఈ 5జీ టెక్నాలజీ అగ్రికల్చర్ను ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. అక్కడ ఎక్కువగా గోధుమలను పండిస్తారు.
యాంజిన్ కౌంటీలో స్మార్ట్ అగ్రికల్చర్ కోసం కేవలం 5జీని మాత్రమే కాదు ఇంకా ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీలను కూడా ప్రభుత్వం ఉపయోగించడానికి ముందుకొచ్చింది. ఇప్పుడు గోధుమలు పండే సీజన్ కాబట్టి నీటిని పంటకు ఎలా అందించాలి, పంటకు తెగుళ్లు పట్టకుండా ఎలా కాపాడుకోవాలి అనే విషయంపై రైతులు ఫోకస్ చేస్తుండగా.. వారికి సాయంగా శాస్త్రవేత్తలు వ్యవసాయంలో టెక్నాలజీని అమర్చే పనిలో ఉన్నారు.
5జీతో స్మార్ట్ అగ్రికల్చర్ను ప్రారంభించిన తర్వాత వ్యవసాయంలో లేబర్ ఖర్చుతో పాటు మరెన్నో ఇతర ఖర్చులు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వ్యవసాయం కోసం ఎంత నీరు ఉపయోగపడుతుంది అనే విషయం దగ్గర నుండి పంట ఎలా పండుతుంది అనే అంశం వరకు ఈ టెక్నాలజీ అన్నింటిని మానిటర్ చేస్తుందని వారు చెప్తున్నారు. అంతే కాకుండా పంటను బాగా పండించడానికి తగిన సూచనలు కూడా ఈ టెక్నాలజీ ద్వారా రైతులు తెలుసుకోవచ్చని అన్నారు.
చైనాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని 5జీ+ స్మార్ట్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని ద్వారా వాతావరణంలోని మార్పులను గుర్తించి దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవచ్చని వారు తెలిపారు. ఈ టెక్నాలజీపై ఒక్క క్లిక్ ఇస్తే చాలు.. నీటిపారుదల మొదలవుతుందని వారు బయటపెట్టారు. తెగుళ్లను నివారించడం మందు కొట్టడానికి కూడా ఒక్క క్లిక్ చాలని వారు అన్నారు. ఇలా రైతులకు ఎంతగానో ఉపయోగపడే మరెన్నో టెక్నాలజీలను వారికి అందజేస్తామని చైనా శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.