5G Services : టెక్నాలజీ అనేది ఎంత అడ్వాన్స్ అవుతున్నా కూడా అందులో కొన్ని సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఏ సమస్య లేకుండా ఒక టెక్నాలజీని మార్కెట్లో ప్రవేశపెట్టినా.. యూజర్ల దగ్గరకు వచ్చేసరికి అది ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పటికీ మార్కెట్లో ఉన్న ఎన్నో కొత్త రకమైన టెక్నాలజీలే దీనికి ఉదాహరణ. ఇప్పుడు ఈ లిస్ట్లోకి 5జీ సర్వీసులు కూడా చేరాయి.
5జీ సిగ్నల్స్ అనేవి ముఖ్యంగా ఇంటర్నెట్ స్పీడ్ను పెంచడానికి మార్కెట్లోకి వచ్చాయి. అంతే కాకుండా దీని ద్వారా వాయిస్ కాల్స్ క్లారిటీ కూడా పెరుగుతుందని టెలికాం సంస్థలు హామీ ఇచ్చాయి. కానీ గత కొంతకాలంగా అటు ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో, ఇటు వాయిస్ కాల్స్ విషయంలో.. యూజర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు 32 శాతం మంది మొబైల్ యూజర్లు.. రోజులో చాలావరకు కవరేజ్ సమస్యలను ఎదుర్కుంటున్నట్టుగా సమాచారం.
4జీ అయినా 5జీ అయినా.. రోజులో చాలావరకు తమకు నెట్వర్క్ సమస్యలు ఉంటున్నాయని 32 శాతం మంది సబ్స్క్రైబర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక మిగిలిన 69 శాతంలో కూడా కాల్ కనెక్షన్ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కేవలం 26 శాతం మంది యూజర్లు మాత్రమే తమ ఇంట్లో అన్ని సిమ్స్కు నెట్వర్క్ బాగా ఉంటుందని చెప్తున్నారు. 5 శాతం మంది తాము పనిచేసే చోట్ నెట్వర్క్ బాగుంటుందని అన్నారు. ఇక 20 శాతం మంది మాత్రం 50 శాతం వాయిస్ కాల్స్ విషయంలోనే ఇబ్బందులు పడుతున్నట్టు బయటపెట్టారు.
యూజర్ల ఇబ్బందులను గమనించిన టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్).. మొబైల్ ఫోన్ ఆపరేటర్స్తో ఒక మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్లో వారు వైర్లైన్ క్వాలిటీ గురించి చర్చించారు. అంతే కాకుండా 5జీ సేవలను ఎలా మెరుగుపరచాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. 5జీకి మారిన సబ్స్క్రైబర్లు అందరిలో కేవలం 16 శాతం మందికే కాల్ కనెక్షన్ విషయంలో సమస్యలు తొలగిపోయాయని ఈ మీటింగ్లో బయటపడింది. అయితే 2023 చివరిలోపు 5జీ సేవలను మెరుగుపరచాలని ట్రాయ్ నిర్ణయించుకుంది.