Employees :ప్రపంచవ్యాప్తంగా అనేక బడా కంపెనీలన్నీ కలిపి 2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. వారిలో భారతీయుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతోనే ఉద్యోగులను ఇంటికి సాగనంపాల్సి వచ్చిందని… ఆయా కంపెనీలు చెప్పాయి. ఇప్పుడు భారత కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా భారత కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. యూనికార్న్ కంపెనీలతో సహా 70 కంటే ఎక్కువ స్టార్టప్లు… 25 వేల మంది సిబ్బందికి పింక్ స్లిప్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఓలా, ఎంపీల్, ఇన్నోవాకర్, అనాకాడెమీ, వేదాంతు, కార్స్24, గో మెకానిక్, ఓయో, మీషో, ఉడాన్ వంటి ఎన్నో కంపెనీలు ఉద్యోగుల్ని ఇళ్లకు సాగనంపాయి. మొత్తం 16 ఎడ్యూటెక్ స్టార్టప్ కంపెనీలు 8 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించగా… ఒక్క జనవరి నెలలోనే దేశంలోని 16కి పైగా స్వదేశీ స్టార్టప్లు… సిబ్బంది సంఖ్యను తగ్గించుకున్నాయి.
కార్ సర్వీసు సేవల్ని అందించే గో మెకానిక్.. ఏకంగా 70 శాతం ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీలో వెయ్యి మందికి పైగా పని చేస్తుండగా… వారిలో 700 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ కూడా అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అందులో 2,500 మంది పని చేస్తుండగా… 500 మంది జాబ్స్ పోగొట్టుకున్నారు.
ఇక హెల్త్ యూనికార్న్ ఇన్నోవేకర్ దాదాపు 245 మంది ఉద్యోగులను తొలగించింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ… డెలివరీ వృద్ధి మందగించడంతో 380 మంది ఉద్యోగులకు ఇంటికి పంపింది. ఎండ్-టు-ఎండ్ డిజిటల్ హెల్త్కేర్ ప్లాట్ఫామ్ అయిన మెడీబడీ… పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా అన్నీ విభాగాల్లో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. దేశీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ఇక్కడితో అయిపోలేదని, ప్రస్తుత పరిణామాల్ని బట్టి చూస్తే… భవిష్యత్తులో ఈ లేఆఫ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.