2023 Scares Employees : ఆదాయాల్లో క్షీణత, ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది బడా కంపెనీల నుంచి చిన్న సంస్థల దాకా అన్నీ కోతలు పెట్టడంతో… ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వచ్చే ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు తప్పదని చాలా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఈ పరిస్థితుల్లో జీతం పెరిగే మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగం ఉంటే చాలని చాలా మంది ఎంప్లాయిస్ అనుకుంటున్నారు.
వచ్చే ఏడాది జీతాల పెంపు చాలా తక్కువగా ఉంటుందని, కొన్ని రంగాల్లో మాత్రం శాలరీ హైక్ బాగానే ఉంటుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా భారత ఎకానమీకి వెన్నదన్నుగా నిలిచే హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం, కన్స్యూమర్/ఎఫ్ఎంసీజీ, పవర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు… ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది జీతాల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. టెక్ కంపెనీల్లో మాత్రం జీతాల పెంపు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. రెసిషన్ భయంతో టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని… మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర టెక్ కంపెనీల పనితీరే ఇందుకు నిదర్శనమని డెలాయిట్ నివేదిక హైలెట్ చేసింది.
వచ్చే ఏడాది కూడా ఐటీ రంగం ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయని డెలాయిట్ నివేదిక చెబుతోంది. ఐటీ ప్రొడక్ట్ కంపెనీల్లో 2022 ఆర్థిక సంవత్సరంలో జీతాల పెంపు 12 శాతంగా ఉండగా… 2023 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతానికే పరిమితం అవుతుందని అంచనా. ఇక ఐటీ సర్వీసెస్లో వేతన పెంపు 2022లో 9.4 శాతం ఉండగా… 2023లో 8.8 శాతానికే పరిమితం కానుంది. వేతనాల పెంపే కాదు… కొత్త నియామకాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక సేవల రంగంలో జీతాల పెంపు 2022లో 8.9 శాతం కాగా… వచ్చే ఏడాది 9.4 శాతానికి చేరనుంది. పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని డెలాయిట్ నివేదిక బయటపెట్టింది.