Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. షాజహాన్ పుర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారరణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంపై అలగంజ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలలాబాద్ నుంచి ఒక ఆటో ప్రయాణికులతో వస్తోంది. అందులోని ప్రయాణికులంతా గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు బయల్దేరారు. ఆటోను.. ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తోన్న ఒక ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. బరేలీ – ఫరూఖాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతులలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను సీఎం యోగి ఆదేశించారు.