1.5 Lakh Jobs:ఆర్థిక మాంద్యం భయాలతో 2022లో భారీగా ఉద్యోగులను తొలగించాయి… అనేక బడా, ఛోటా కంపెనీలు. అలా ఊడిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? అక్షరాలా లక్షన్నరకు పైనే. నిరుడు ప్రపంచవ్యాప్తంగా 1,013 సంస్థలు… 1,53,160 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయని, లేఆఫ్స్.ఎఫ్వైఐ లైవ్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. అదే కొవిడ్ మొదలైన 2020 నాటి నుంచి చూస్తే… 1,539 సంస్థలు ఇప్పటివరకు 2,49,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు లెక్క తేలింది. ఊడిన ఉద్యోగాలు ఎక్కువగా కన్జ్యూమర్, రిటైల్ రంగంలోనే ఉన్నాయి.
కరోనా సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ జీతాలిచ్చి మరీ నిపుణులను నియమించుకున్న టెక్ కంపెనీలు… ఇప్పుడు అవసరం తీరిపోవడంతో వీలైనంత మంది ఉద్యోగుల్ని వదలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చేస్తున్న పని కంటే ఎక్కువ జీతం పొందుతున్నారని భావించిన వారిని, సరిగ్గా పని చేయని వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొగిస్తున్నాయి.
ఆర్థిక మాంద్యం భయాలతో అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు కూడా తగ్గిపోయాయి. అందుకే ఖర్చులు తగ్గించుకోడానికి ఐటీ కంపెనీలు అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆదాయం పడిపోవడంతో ఇప్పటికే మెటా 11 వేల మందిని, అమెజాన్ 10 వేల మందిని ట్విట్టర్ 75 శాతం మందిని, సిస్కో 4,100 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్వైఐ వెల్లడించింది. ఇక మన దేశ స్టార్టప్ కంపెనీలు కూడా 2022లో 18 వేల మంది ఉద్యోగులను తొలగించాయని మరో సంస్థ వెల్లడించింది.
ఉద్యోగుల్ని తీసివేయడమే కాదు.. నూతన నియామకాల్లోనూ దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయితే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, వెబ్ 3, డేటాసైన్స్, అనలిటిక్స్ లాంటి వాటిల్లో డిమాండ్ ఉండటంతో… ఆయా పనులు చేయగల నిపుణుల కోసం కంపెనీలు వెతుకుతున్నాయి. దాంతో… ఇంటర్న్షిప్ల విషయంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు.