University Grants Commission key Decision: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ – యూజీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లోనూ ఏటా రెండుసార్లు అడ్మిషన్లు జరపాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం(2024-25) నుంచే ఈ విధానం అమల్లోకి రానున్నదని యూజీపీ చైర్మన్ ఆచార్య జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. తొలి విడతలో జులై – ఆగస్టు, మలి విడతలో జనవరి – ఫిబ్రవరీలలో అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు.
అయితే, మరో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ విధానం తప్పనిసరి కాదని, ఐచ్ఛికమేనంటూ స్పష్టం చేశారు. ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ల విధానాన్ని అమల్లోకి తేవడంతో వివిధ బోర్డుల ఫలితాల ప్రకటనలో జాప్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులలో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరించారు. విద్యార్థులు మరుసటి ఏడాది వరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉండబోదని పేర్కొన్నారు. ద్వైవార్షిక ప్రవేశాల వల్ల కంపెనీలు ప్రాంగణ నియామకాలను ఏడాదికి రెండుసార్లు చేపడుతాయని, దీంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జగదీశ్ కుమార్ తెలిపారు.
రెండుసార్లు ప్రవేశాల విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యాసంస్థలు తమ వనరులను సమర్థంగా పంపిణీ చేసుకోవటానికి అవకాశముంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్యాకల్టీ, ల్యాబ్ లు, తరగతి గదులు, ఇతర అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవొచ్చని, ఫలితంగా యూనివర్సిటీల వ్యవస్థలు అత్యుత్తమంగా పనిచేస్తాయని అంటూ ఆయన వెల్లడించారు.
Also Read: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశం.. ఎన్టీయేకు సుప్రీం నోటీసులు..!
ఇదిలా ఉంటే.. నీట్ యూజీ పరీక్ష 2024 పేపర్ లీక్ అంశం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ పేపర్ లీక్ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2024 నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా పలువురు కౌన్సిలింగ్ మీద స్టే విధించాలని కోరగా, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.