Zombie Virus : వాస్తవానికి ఇప్పటికే కశ్మీర్లోని గుల్మార్గ్ను మంచు దట్టంగా ఆవరించి ఉండాలి. కానీ ఈ ఏడాది మంచు అన్నది ఇంచు కూడా కానరావడం లేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంచు ఏర్పడకపోవడం లేదంటే ఇప్పటికే ఘనీభవించి ఉన్న మంచు కరిగిపోవడమో జరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగేట్టు లేదు. ఏకంగా ఆర్కిటిక్, ఇతర ప్రాంతాల్లోని మంచుదిబ్బలు సైతం కరిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే.. ఆ మంచు దిబ్బల అడుగున నిద్రాణ స్థితిలో ఉన్న వేల ఏళ్ల నాటి వైరస్లతో పెను ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పెర్మాఫ్రాస్ట్ కరిగితే అత్యంత ప్రమాదకరమైన జాంబీ వైరస్లు తిరిగి ఉనికిలోకి వచ్చే ప్రమాదం ఉందన్న అంశమే ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో కరోనా లాంటి మరో మహమ్మారి చుట్టుముట్టే అవకాశం లేకపోలేదనే భయం శాస్త్రవేత్తలను వెన్నాడుతోంది. పెర్మాఫ్రాస్ట్ అనేది మంచు, మట్టి, ఇసుక కలగలసి గడ్డకట్టిన పొర. ఉత్తరార్థగోళంలో 25 శాతం ఇలాంటి పొరే అవరించి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఓ పెద్ద ఫ్రీజర్గా చెప్పుకోవచ్చు.
ఉదాహరణకు.. పెర్మాఫ్రాస్ట్లో ఇప్పుడు పెరుగును నిల్వ చేస్తే.. 50 వేల ఏళ్ల తర్వాత కూడా దానిని భేషుగ్గా తినొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే అన్నేళ్లయినా ఏదీ చెక్కుచెదరదన్న మాట. అలాంటి పెర్మాఫ్రాస్ట్.. సూక్ష్మజీవులు, కర్బనం, విషపూరిత పాదరసం వంటి వాటిని తనలో కలిపేసుకుంది. జాంబీ వైరస్ గురించి పరిశోధిస్తున్న మైక్రోబయాలజిస్ట్ జీన్ మేరీ అలెంపిక్ నేతృత్వంలోని బృందం గతంలో సైబీరియా నుంచి సేకరించిన పెర్మాఫ్రాస్ట్ నమూనాలను పరిశీలించింది. అప్పుడే కొత్త వైరస్లు బయటపడ్డాయి. ఇవి 48,500 ఏళ్లుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి.
మంచుదిబ్బల మాటున వైరస్లు దాగి ఉన్నాయన్న విషయం ఇప్పటిది కాదు. 2014లోనూ పెర్మాఫ్రాస్ట్ నుంచి బయటపడిన వైరస్ 30 వేల ఏళ్ల నాటిది. 2016లో సైబీరియాను వణికించిన ఆంత్రాక్స్ వైరస్.. మంచుదిబ్బల నుంచి బయటకు వచ్చిందే. 1941లో మంచులో కూరుకుపోయిన ధ్రువపుజింక కళేబరం నుంచి ఆంత్రాక్స్ ప్రబలింది.
భూమ్మీద మంచు కరుగుతున్న కొద్దీ బయటపడే వైరస్లు ఎన్నో ఉంటాయని, వాటిలో ఏ ఒక్కదానివల్లనైనా ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తల వాదనగా ఉంది. భూతాపం వల్ల హిమానీనదాలు కరగడం ఇప్పటికే ఆరంభమైంది. ఇది మరింత పెరిగితే పరిస్థితి ఏమిటనేది శాస్త్రవేత్తల ఆందోళన. అదే జరిగితే లక్షల టన్నుల్లో సూక్ష్మజీవులు సరస్సులు, నదుల్లోకి చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఐరోపా, ఉత్తర అమెరికాలో 8 ప్రాంతాలు, గ్రీన్లాండ్లో రెండు ప్రదేశాల నుంచి సేకరించిన ఉపరితల జలాల నమూనాలను వారు పరిశీలించారు. ప్రతి మిల్లీలీటరు నీటిలో వేలసంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నట్టు గుర్తించామని ఆ పరిశోధనకు నేతృత్వం వహించిన మైక్రోబయాలజిస్ట్ ఆర్విన్ ఎడ్వర్డ్స్ వెల్లడించారు. వచ్చే 80 ఏళ్లలో హిమానీనదులు కరగడం వల్ల వచ్చే జలాల్లోకి ఈ బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉందంటున్నారు.