Yahya Sinwar as Hamas new chief(Today international news headlines): ఇజ్రాయెల్ కు గాజా సాయుధ పోరాట దళం హమాస్ మరో షాకిచ్చింది. కొత్త అధ్యక్షుడిగా యూదుల శత్రువు.. కరుడుగట్టిన నరహంతకుడిగా పేరొందిన కమాండర్ యాహ్య సిన్వర్ ను ఎన్నుకున్నట్లు హమాస్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియెను ఇజ్రాయెల్ హత్య చేసింది. దీంతో అతని స్థానంలో యాహ్యా సిన్వర్ బాధ్యతలు చేపట్టాడు. ఇజ్రాయెల్ పై చాలా సార్లు దాడులు ప్లాన్ చేసి.. ఎన్నో సార్లు ఇజ్రాయెల్ ఆర్మీ తనను చంపడానికి ప్రయత్నిస్తే.. వాళ్ల చేతికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు.
ఇజ్రాయెల్ ను అన్ని విధాలుగా ఢీ కొనే తెలివితేటలు యాహ్యా సిన్వర్ కు ఉన్నాయని హమాస్ సభ్యుల భావించి అతడిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇంతకుముందు అతని స్థానంలో సీనియర్ నాయకుడు ఖాలిద్ మిశాల్ ను అధ్యక్షుడిగా ఎన్నిక ఖాయమనుకున్న తరుణంలో వయసు రీత్యా ఖాలిద్ ఆ బాధ్యతలు స్వీకరించలేదని సమాచారం.
”యహ్యా సిన్వర్ మా కొత్త నాయకుడు.. ఆయన ఎన్నిక ద్వారా ఇజ్రాయెల్ కు ఒక్కటే చెప్పదలచుకున్నాం. గాజా యుద్ధానికి ఏ విధంగా రాజీలేని ఒక శాశ్వత పరిష్కారం. గాజా యుద్ధాన్ని ముగించేందుకు మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. శాంతి చర్చల్లో కూడా యహ్యా సిన్వర్ ప్రతినిధిగా ఉంటారు. మా వద్ద ఇంకా 115 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు.” అని హమాస్ తన ప్రకటనలో పేర్కొంది.
Also Read: బంగ్లా సంక్షోభం.. భారతపై ప్రభావమెంత?
యహ్యా సిన్వర్ ఎవరు?
యహ్యా సిన్వర్ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించాడు. 61 ఏళ్ల సిన్వర్ దాదాపు 14 సంవత్సరాలు ఇజ్రాయెల్ జైలులోనే బందీగా గడిపాడు. ఇజ్రాయెల్ సైనికులను, వారికి సహాయం చేసిన నలుగురు పాలస్తీనా వాసులను సిన్వర్ హత్య చేయడంతో అతని పేరు గాజా ఫైటర్ల గ్రూపులో మార్మోగిపోయింది. ఇంతవరకు అతను వివాహం చేసుకోకుండా హమాస్ కే తన జీవితం అంకితం చేశాడు. అక్టోబర్ 7 తో పాటు ఇజ్రాయెల్ పై ఎన్నో దాడులు చేశాడు.
అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ పై దాడులు చేసి 1200 మంది పౌరులను మరణానికి కారణమయ్యాడు. 150 మంది పౌరులను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన తరువాత ఇజ్రాయెల్ పై దాడి చేసి జయించలేరని నానుడి ఒక అబద్ధం అని నిరూపించాడు.
పాలస్తీనా వాసుల భూములను ఆక్రమించుకున్న వందల సంఖ్యలో వారిని ఊచకోత కోసిన ఇజ్రాయెల్ ‘నక్బా’ ఘటనలో సిన్వర్ కుటుంబం కూడా ఉంది. ఈ ఘటన తరువాత సిన్వర్ ఇజ్రాయెల్ పై ప్రతీకారమే తన జీవిత లక్ష్యమే పోరాడుతున్నాడని పాలస్తీనా వాసులు అతడిని తమ హీరోగా చూస్తారు.
మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా, ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా హమాస్ అధ్యక్షుడిని ఇజ్రాయెల్ హత్య చేయడం, కొత్త అధ్యక్షుడిగా యహ్యా సిన్వర్ ఎన్నిక కావడంతో.. ఈ సంధి కుదురుతుందనే ఆశలు సన్నగిల్లాయి.