World Day for War Orphans : యుద్ధం కొందరికి వ్యాపారం. మరికొందరికి ఇది ప్రతిష్ఠ. ఇంకొందరికి ఇది అవసరం. మరికొందరికి ఇది.. ఒక సరదా. కారణాలేమైనా యుద్ధాల కారణంగా మానవాళికి జరుగుతున్న నష్టం మాత్రం అపారం. నాటి కురుక్షేత్రం నుంచి నేటి ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధం వరకు జరిగిన యుద్ధాల్లో గెలిచిందెవరో, ఓడిందెవరో పక్కనబెడితే.. వీటన్నింటికీ ప్రధాన కారణం మాత్రం మనిషిలోని మితిమీరిన స్వార్థమే.
యుద్ధం.. ఏదైనా దాని గురించి ప్రపంచానికి తెలిసేది సగమే. యుద్ధం కారణంగా అనాథలైన వారి ఆక్రందనలు, యుద్ధం వల్ల సర్వమూ కోల్పోయి వలస బాట పట్టిన అభాగ్యులు ఆవేదన, యుద్ధం వల్ల వికలాంగులై జీవితాంతం చీకటిలో మగ్గిపోయే బడుగుల వెతలు ఏ చరిత్రకూ ఎక్కవు. మరీ ముఖ్యంగా యుద్ధం వల్ల కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి.. అనాథలుగా మిగిలే చిన్నారుల దుర్భర జీవితాలు ఎవరికీ పట్టవు. వీరంతా ఓ వయసు వచ్చే వరకు శరణార్ది శిబిరాల్లో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు.
ఇలాంటి అనాథల ఆర్తిని ప్రపంచానికి తెలియజేసి, వారి సంరక్షణకు అందరూ కలిసొచ్చేలా చేసేందుకే ఐక్యరాజ్యసమితి ఏటా జనవరి 6న యుద్ధ అనాథల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. యుద్దాల కారణంగా అనాథలుగా మారిన పిల్లలు.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్నో సామాజిక, మానసిక, శారీరక, సాంస్కృతిక సమస్యలను ప్రపంచం దృష్టికి తెచ్చి, యుద్ధం కారణంగా రోడ్డున పడ్డ ఈ పిల్లల బతుకు పోరాటాన్ని చూసైనా భవిష్యత్తులో యుద్ధోన్మాదాన్ని తగ్గించాలనేదే సమితి ఆకాంక్ష.
ఉక్రెయిన్ యుద్ధంతో బాటు ప్రపంచంలోని అశాంతి, హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్యుద్ధాల వల్ల 2021 నాటికి 10కోట్ల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం వెల్లడించింది. ఇథియోపియా, బుర్కినా ఫాసో, మయన్మార్, నైజీరియా, అఫ్గానిస్థాన్, కాంగో పరిస్థితులపై ఆ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ నుంచి 65 లక్షల మంది దేశం విడిచిపోగా.. మరో 80 లక్షల మంది దేశంలోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిపింది. ప్రపంచ జనాభాలో ఈ బాధితుల సంఖ్య ఏకంగా 1 శాతం.
2015 నాటికి యుద్ధం వల్ల అనాథలైన పిల్లల సంఖ్య 14 కోట్లు కాగా.. వీరిలో ఆసియాలో 6.1 కోట్ల మంది, ఆఫ్రికాలో 5.2 కోట్ల మంది, లాటిన్ అమెరికా, కరేబియన్లలో కోటిమంది, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో 73 లక్షలమంది పిల్లలు అనాథలైనట్లు ఐరాస లెక్క తేల్చింది. ఈ మొత్తం అనాథ పిల్లల్లో 95 శాతం మంది ఐదేళ్లకు పైబడిన వారే. అంటే ఐదేళ్లకే కుటుంబ సభ్యలందరినీ కోల్పోయిన వీరంతా దిక్కుతోచని పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ – పాలస్తీనా ఉద్రిక్తతలు ఇప్పట్లో నెమ్మదించేలా కనిపించని నేపథ్యంలో రాబోయే కాలంలో మరింత మంది పిల్లలు అనాథలయ్యే ప్రమాదం ఉందని బాలల హక్కుల సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.