Continent Turns Green: మంచుతో నిండిని ప్రదేశాలు ఆర్కిటికా, అంటార్కిటికాలు. అయితే, నిరంతరం మంచుతో మెరుస్తూ ఉండే అంటార్కిటికా మరికొంత కాలం తర్వాత మన దగ్గర ఉన్నట్లే చెట్లూ మొక్కలు, మట్టి నేల రూపానికి చేరుకుంటుందంట. అయితే, మంచిదేగా అనుకుంటే పొరపాటు పడ్డట్లే! అంటార్కిటికా తీర ప్రాంతం మంచులో పచ్చదనం వస్తున్న కొద్దీ భూమిపై మరిన్ని ఉత్పాతాలు వస్తున్నాయని అర్థం. అవును. అయితే, ఒకప్పుడు కొద్దిగగా ఉన్న ఈ ఆకుపచ్చ మంచు ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపిస్తోందని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. ఇంతకీ, అంటార్కిటికా ఎందుకు పచ్చగా మారుతోంది? అంటార్కిటికా(Antarctica)మంచు కరిగిపోతే ఏమి జరుగుతుంది?
మంచుతో నిండిని ప్రదేశా ఆర్కిటికా, అంటార్కిటికాలు. అయితే, నిరంతరం మంచుతో మెరుస్తూ ఉండే అంటార్కిటికా మరికొంత కాలం తర్వాత మన దగ్గర ఉన్నట్లే చెట్లూ మొక్కలు, మట్టి నేల రూపానికి చేరుకుంటుందంట. అయితే, మంచిదేగా అనుకుంటే పొరపాటు పడ్డట్లే! అంటార్కిటికా తీర ప్రాంతం మంచులో పచ్చదనం వస్తున్న కొద్దీ భూమిపై మరిన్ని ఉత్పాతాలు వస్తున్నాయని అర్థం. అవును. అయితే, ఒకప్పుడు కొద్దిగగా ఉన్న ఈ ఆకుపచ్చ మంచు ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపిస్తోందని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. ఇంతకీ, అంటార్కిటికా ఎందుకు పచ్చగా మారుతోంది? అంటార్కిటికా మంచు కరిగిపోతే ఏమి జరుగుతుంది?
సహజత్వానికి భిన్నంగా ఏది జరిగినా అది వినాశనానికే దారి తీస్తుందనడంలో సందేహం లేదు! ప్రస్తుతం అంటార్కిటికాలో కూడా ఇదే జరుగుతుంది. తెల్లని మంచుతో కప్పుకుపోయిన ఈ ఖండం ఇప్పుడు ఆకుపచ్చని ప్రదేశంగా మారుతుంది. ఇటీవలి అంటార్కిటికా ఫొటోలు చూస్తే… ఇది ఖచ్చితంగా అంటార్కిటికా కాదు పచ్చని మైదానాలుండే కశ్మీర్లాంటి ఏదో ప్రదేశం అనుకునే అవకాశం ఉంది. అంతలా మారింది అంటార్కిటికా. అయితే, ఇంతటి మార్పుకు కారణం మాత్రం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, అంటార్కిటికా మంచు ఆకుపచ్చగా మారుతుందని అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కే ఉష్ణోగ్రతలు ‘ఆకుపచ్చ మంచు’ ఏర్పడటానికి, అది వ్యాప్తి చెందడానికి సహాయపడతున్నాయనీ… అంతరిక్షం నుండి చూసినప్పుడు ఈ వ్యాప్తి స్పష్టంగా అర్థమవుతుందని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడిస్తోంది.
మొదటిసారి భారతదేశానికి చెందిన జీవశాస్త్రవేత్తలు, 2017లో ఈ మంచు ఖండంలో జరిపిన పరిశోధనల్లో ఒక రకమైన నాచు జాతికి చెందిన కొత్త మొక్కలను కనుగొన్నారు. ఇవి కొత్త జాతి మొక్కలని నిర్ధరించడానికి శాస్త్రవేత్తలకు ఐదేళ్లు పట్టింది. ఈ పరిశోధనా ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ ఆసియా-పసిఫిక్ బయోడైవర్సిటీ’ అనే ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారు. పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తలు తాము కనుగొన్న కొత్త జాతి మొక్కలకు ‘బ్రయం భారతీయెన్సిన్స్’ అని నామకరణం చేశారు. అంటార్కిటికాలో ఉన్న ఒక భారత పరిశోధనా కేంద్రానికి భారతి అనే పేరు ఉంది. దానిపేరు మీదుగా ఈ మొక్కలకు ఈ నామకరణం చేశారు. అయితే, ఇలాంటి పచ్చని నాచు ఇది వరకు ఎప్పుడూ అంటార్కిటికాలో గమనించలేదు. అందుకే, ఈ పరిణామం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది.
అంటార్కిటికాలో 1% మాత్రమే మంచు లేని ప్రాంతం ఉంది. అలాంటిది, ఇప్పుడు ఈ పచ్చదనం తీర్ర ప్రాంతమంతా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ మొక్కలు జీవించడానికి పొటాషియం, భాస్వరం, సూర్యరశ్మి, నీరుతో పాటు నైట్రోజన్ కూడా అవసరం. ఇక, రాయి, మంచుతో కూడిన ఇలాంటి ప్రదేశంలో నాచు ఎలా మనుగడ సాగించిందనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. అయితే, ఈ నాచు ప్రధానంగా పెంగ్విన్ పక్షులు అధిక సంఖ్యలో గుడ్లు పొదిగే ప్రాంతాల్లోనే పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పెంగ్విన్ మలంలో నైట్రోజన్ ఉంటుంది గనుక, ఈ కొత్త జాతి నాచు మొక్కలు పెంగ్విన్ మలంపై ఆధారపడి జీవించాయని పరిశోధకులు అంచనాకు వచ్చాయి. అయితే ఇక్కడి వాతావరణంలో పెంగ్విన్ ఎరువు కుళ్లిపోదు కాబట్టి, అది మొక్కల పెరుగుదలకు లాభదాయకంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Also Read: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..
వాస్తవానికి, అంటార్కిటికా ఖండంలో ఒక ఆరు నెలలు సూర్యుడు అస్సలు కనిపించడు. ఉష్ణోగ్రతలు మైనస్ 76 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచు కింద ఈ మొక్కలు ఎలా మనుగడ కొనసాగించాయన్నదే ఇంకా అంతు చిక్కని అంశం. నిజానికి, ఆ సమయంలో ఈ నాచు మొక్కలు పూర్తిగా ఎండిపోయి, దాదాపు విత్తనాల్లా మారిపోయి ఉండాలి. మళ్లీ, సెప్టెంబర్లో వేసవి ప్రారంభమై, సూర్య కిరణాలు పడ్డాక మళ్లీ మొలకెత్తాయేమో అని అనుకుంటున్నారు. వేడికి మంచు కరుగుతున్నప్పుడు ఆ నీటిని పీల్చుకుని మొక్కలు చిగురిస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ మంచుఖండంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న క్రమంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని గమనించారు. కరిగిపోతున్న హిమనీనదాలు, బీటలు వారిన మంచు పలకలు, వాటిపై పేరుకుంటున్న సరస్సులను పరిశోధకులు గుర్తించారు. ఇందులో భాగంగానే అంటార్కిటికాలో పచ్చదనం విస్తరిస్తోందనీ.. గతంలో ఈ మంచుఖండంలో మనుగడ సాగించలేకపోయిన సమశీతోష్ణ మొక్కలు కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయనీ.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఖండం వేడెక్కడం ఈ విపరీతానికి కారణం అని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటార్కిటికా పచ్చదనాన్ని సంతరించుకుంటోంది అనే వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. దట్టమైన మంచు పలకల కింద ఏముందో ఇవ్వరికీ తెలీదు. అవి కరిగిపోతే ఏం బయటపడతాయో కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా.. మంచు కరిగిపోతే వందల వేల సంవత్సరాల నాటి వ్యాధికారకమైన సూక్ష్మ క్రిములు అనేకం బయటపడే అవకాశాలున్నాయి. అదే గనుక జరిగితే మానవాళికి మరింత ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు, దక్షిణ అమెరికా కొనకు ఉత్తరాన ఉన్న అంటార్కిటికా మంచు పర్వతాల గొలుసు, ప్రపంచ సగటు కంటే చాలా వేగంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత నాలుగు దశాబ్దాలలో ఈ కఠినమైన వాతావరణంలో పచ్చదనం 10 రెట్లు పెరిగిందని కనుగొన్నారు. నేచర్ జియోసైన్స్ జర్నల్లో దీనిపై పూర్తి వివరాలను ప్రచురించారు. 1986లో అంటార్కిటిక్ ద్వీపకల్పంలో 0.4 చదరపు మైళ్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న వృక్షసంపద 2021 నాటికి దాదాపు 5 చదరపు మైళ్లకు చేరుకుందని అధ్యయనం కనుగొంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతం పచ్చగా మారుతుంది. 2016-2021 మధ్య 30% కంటే ఎక్కువ వేగవంతమైంది. ఈ వేసవిలో, జూలై మధ్య నుండి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 50 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరగడంతో ఖండంలోని కొన్ని ప్రాంతాలు రికార్డు స్థాయిలో వేడిని ఎదుర్కొన్నాయి. మార్చి 2022లో, ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 70 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇది ఈ భాగంలో ఇప్పటివరకు నమోదైన అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత.
ఈ అనూహ్య మార్పులతో అంటార్కిటికాలో ఎంత పచ్చదనం పెరిగితే, అంత ఎక్కువ నేల ఏర్పడుతుంది. దీని వల్ల స్థానిక వన్యప్రాణులకు కూడా ముప్పు ఉంది. అంటార్కిటిక్ ద్వీపకల్పానికి టూరిస్ట్లు తాకిడి కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది. పరిశోధనలు, పర్యాటకం పేరుతో కూడా అంటార్కిటికాలో కొత్త జాతి గింజలు, నాచు తదితరాదులు చేరుకుంటున్నాయి. ఇది, ఇక్కడ కొత్త రకమైన పచ్చదనానికి కారణం అవుతుంది. మానవ తప్పిదాలు, పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ఈ తరుణంలో అంటార్కిటికాలో మార్పు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులే కొనసాగితే అంటార్కిటికాలో భూమి ఏర్పడినప్పటికీ.. మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లోని భూమి నీటిలో మునిగిపోయి, సముద్రాలుగా మారతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూతాపం వల్ల సముద్రం ఏటా 3 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన పారిస్ ఒప్పందాన్ని సీరియస్గా అమలు చేయకపోతే… భూమి నాశనం అతిత్వరలోనే అనివార్యంగా మారుతుంది.