భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిక్కు అసమ్మతివాదులను టార్గెట్ చేసిందని కెనడా ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారత ఏజెంట్ల మద్దతుతో బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు నిందితులలో భారత హైకమిషనర్ వర్మను చేర్చడంతో పాటు మరో ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఇంతకీ లారెన్స్ బిష్ణోయ్ ఎవరు? అతడు జైల్లో ఉండే తన నేర సామ్రాజ్యాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు? కెనడా-భారత్ మధ్య దౌత్య యుద్ధానికి ఎలా కారణం అయ్యాడు? అనే చర్చ దేశ వ్యాప్తం జరుగుతోంది.
కాలేజీ రోజుల నుంచే నేరాలు..
రీసెంట్ గా మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్ స్టర్ జైల్లో ఉన్నప్పటికీ.. అతడి సోదరుడు కెనడా నుంచి తన గ్యాంగ్ ను మెయింటెయిన్ చేస్తున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్ ఫిరోజ్పుర్ జిల్లా ధత్తరన్ వాలీలో జన్మించారు. తల్లిదండ్రులు అత్యంత సంపన్నులు. అత్యంత గౌరవం కలిగిన బిష్ణోయ్ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ వర్గం వాళ్లు ఎక్కువగా రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లో ఉంటారు. లారెన్స్ పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో చదివాడు. జాతీయ స్థాయి అథ్లెట్ గా ఎదిగాడు. పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పని చేశాడు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నాడు. విద్యార్థి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సమయంలో గోల్డీ బ్రార్ తో ఆయనకు దోస్తీ ఏర్పడింది. నెమ్మదిగా విద్యార్థి రాజకీయాల ముసుగులో నేరాలు మొదలు పెట్టాడు. డీవీఎ కాలేజీ గ్యాంగ్ గొడవల్లు ప్రత్యర్థులు అతడి గర్ల్ ఫ్రెండ్ ను సజీవ దహనం చేశారు. తన ప్రియురాలి చావుకు కారణం అయిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. బిష్ణోయ్ పూర్తి నేరస్తుడిగా మారాడు.
ఉత్తరాదిలో నేర సామ్రాజ్యం విస్తరణ
2018లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ హత్యకు ఫ్లాన్ చేయడంతో లారెన్స్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ప్రస్తుతం లారెన్స్ నేర సామ్రాజ్యం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ కు విస్తరించింది. ఆయన గ్యాంగ్ లో పెద్ద సంఖ్యలో ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, బిష్ణోయ్ ని చంపేందుకు యాంటీ గ్యాంగ్స్ ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అతడు సబర్మతి జైల్లో ఉన్నా తన గ్యాంగ్ తో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడి సోదరుడు అన్మోల్, మిత్రుడు గోల్డీ బ్రార్ ఈ గ్యాంగ్ ను కొనసాగిస్తున్నారు.
సల్మాన్ తో గొడవ ఏంటి?
నటుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడారు. కృష్ణ జింకలను బిష్ణోయ్ వర్గం వారు పవిత్రంగా భావిస్తారు. అదే వర్గానికి చెందిన బిష్ణోయ్ కి సల్మాన్ చేసిన పని అస్సలు నచ్చలేదు. అందుకే ఆయనను హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్లో సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపారు. ఆయన ఫామ్ హౌస్ దగ్గర కూడా నిఘా వేసినట్లు పోలీసులు తెలిపారు. సల్మాన్ హత్యకు సుమారు 25 మందితో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
జైల్లో నుంచే గ్యాంగ్ ఆపరేషన్స్
ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ మీద సుమారు 25 కేసులు ఉన్నాయి. కొద్ది సంవత్సరాలుగా జైల్లోనే ఉంటున్నాడు. అయిప్పటికీ తన గ్యాంగ్ తో నిత్యం టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. జైలు అధికారుల సాయంతోనే ఆయన ఫోన్లు మెయింటెయిన్ చేస్తున్నారు. సమాజంలో పెద్ద పేరున్న వారిని టార్గెట్ చేయడం వల్ల తమ గ్యాంగ్ బాగా పాపులర్ అవుతుందని బిష్ణోయ్ భావిస్తున్నాడు. అందులో భాగంగానే సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీని చంపేశాడు. సల్మాన్ సహా మరికొంత మందిని హిట్ లిస్టులో చేర్చాడు.
కెనడా వివాదంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
ఇక ప్రస్తుతం కెనడా- భారత్ దౌత్య యుద్ధానికి బిష్ణోయ్ కారణం అయ్యాడు. భారత ఏజెంట్లు లారెన్స్ బిష్ణోయ్ తో కలిసి తమ దేశంలో ఖలిస్థానీ నాయకులను చంపుతున్నారని కెనడా ఆరోపించడంతో అతడి పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. గత ఏడాది ఖలిస్థానీ వేర్పాటువాది సుఖ్ దూల్ సింగ్ను భారత్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చింది. మరుసటి రోజే కెనడాలోని విన్నిపెగ్ లో జరిగిన కాల్పుల్లో సుఖ్ దూల్ మరణించాడు. అతడిని తామే చంపినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించింది. తాజాగా నిజ్జర్ ను కూడా అదే గ్యాంగ్ చంపినట్లు కెనడా ఆరోపిస్తోంది. మరోవైపు కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదం బలంగా మారువుతున్నాయి. భారత్ ను దెబ్బతీసే ప్రయత్నాలు అక్కడి నుంచే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కెనడా సరికొత్త పాకిస్తాన్ గా మారిందని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్ తో పోల్చితే కెనడాతో సంబంధాలు మరింత దారుణంగా ఉన్నాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం, వీసాల జారీ, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?