white phosphorus : గాజా, లెబనాన్పై సైనిక చర్యలో భాగంగా ఇజ్రాయెల్ వైట్ ఫాస్పరస్ మందుగుండును వినియోగించిందా? హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అదే అనుమానిస్తోంది. 10, 11 తేదీల్లో లెబనాన్, గాజా సిటీలపై ఇజ్రాయెల్ గగనతలదాడులు నిర్వహించింది. ఆ దాడుల వీడియోలను పరిశీలించిన ఆ సంస్థ వైట్ ఫాస్పరస్ను ఇజ్రాయెల్ వినియోగించిదంటూ ఆరోపణలు చేసింది.
కెమికల్ వెపన్స్ కింద వైట్ ఫాస్పరస్ నిషిద్ధం కాకున్నా.. కొన్ని సంప్రదాయ ఆయుధాల వినియోగంపై కుదిరిన ఒప్పందం మేరకు దానిని వినియోగించడం నేరమే. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల్లో ఇజ్రాయెల్ మాత్రం లేదు. హమాస్ మెరుపుదాడి నేపథ్యంలో మొత్తం 1300 మంది ఇజ్రాయెలీలు మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 1500 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అటు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపైనా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది.
ఈ దాడులకు సంబంధించి రెండు వీడియోలను పరిశీలించిన హ్యూమన్ రైట్స్ వాచ్.. 155 ఎంఎం వైట్ ఫాస్పరస్తో ఆర్టిలరీ షెల్స్ను ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిందని ఆరోపించింది. పాలస్తీనియన్ టీవీ చానెళ్లు ప్రసారం చేసిన ఆ వీడియోలు.. గాజా, లెబనాన్ పై జరిపిన తాజా దాడులకు సంబంధించినవే అనే విషయాన్ని ఆ గ్రూప్ ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ సైన్యం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ప్రస్తుతం గాజాలో వినియోగించిన ఆయుధాల్లో వైట్ ఫాస్పరస్ ఉన్నట్టు భావించడం లేదని వ్యాఖ్యానించింది.
2008-09లో గాజాపై వైట్ ఫాస్పరస్తో కూడిన మందుగుండును ఇజ్రాయెల్ వాడింది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. వైట్ ఫాస్పరస్ వినియోగానికి దశలవారీగా స్వస్తి పలికినట్టు 2013లోనే ఇజ్రాయెల్ మిలటరీ స్పష్టం చేసింది. వైట్ ఫాస్పరస్ బాంబులను యుద్ధక్షేత్రంలో వినియోగించడం చట్టబద్ధమే. కానీ జనావాసాలపై ప్రయోగించకూడదు. అవి పౌరుల ప్రాణాలకు తీవ్ర ముప్పును కలగజేస్తాయి. దీర్ఘకాలం అస్వస్థతకు గురవుతారు.
సాధారణ ఫాస్పరస్ బాంబుల్లాగా నేలపై పడి పేలిపోవడం కాకుండా.. వైట్ ఫాస్పరస్ బాంబులు గాల్లోనే పేలతాయి. విపరీతమైన పొగ వెలువడుతుంది. ఆ పేలుడుతో విడివడే తునకలు సైతం భూమ్మీద చెల్లాచెదురుగా పడి దట్టమైన పొగను వెలువరుస్తాయి. ఈ తరహా షెల్స్ వినియోగించినప్పుడు పొగ మందపు తెరలాగా ఏర్పడి శత్రుసైన్యం కదలికలను అడ్డుకుంటుంది. ముఖ్యంగా గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో వీటిని వినియోగిస్తుంటారు.
హమాస్ మిలిటెంట్లను సమూలంగా ఏరివేరేయాలని ఇజ్రాయెల్ సంకల్పించింది. గాజా కలుగుల్లో దాక్కున్న మిలిటెంట్లను బయటకు లాక్కురావాలంటే గ్రౌండ్ ఆపరేషన్ ఒక్కటే శరణ్యమని భావించి.. ఆ దిశగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(ఐడీఎఫ్) సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనియన్లను తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడాలని ఆదేశించింది.
దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోంది. రీలొకేషన్ కారణంగా దారుణమైన మానవతా సంక్షోభం నెలకొంటుందని భయపడుతోంది. ఐడీఎఫ్ తాజా ఆదేశాలను చూస్తేంటే.. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్కు పావులు కదుపుతున్నట్టే అని భావించాలి. గాజాలోని సొరంగాల్లో నక్కిన మిలిటెంట్లను అంతం చేయడంతో పాటు వారి వద్ద బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం ఐడీఎఫ్ ముందున్న అతి పెద్ద సవాల్.